దేశంలో ప్రజా రవాణాను ప్రారంభించిన తొలి రాష్ట్రం ఇదే: నిబంధనలు కఠినమే
ఛండీగఢ్: కరోనా లాక్డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా ప్రజా రవాణా నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఇప్పటికే లాక్ డౌన్ విధించి దాదాపు రెండు నెలలు కావస్తుండటంతో నిబంధనలు సడలిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి.
కరోనా లాక్డౌన్ 4.o: భారీ సడలింపులు, ఇక రాష్ట్రాలకే ఆ అధికారం
తొలి రాష్ట్రంగా హర్యానా
కాగా, హర్యానా ప్రభుత్వం ఆ రాష్ట్రంలో బస్సు సేవలను తిరిగి ప్రారంభించింది. లాక్ డౌన్ తర్వాత దేశంలో తొలిసారి బస్సు సేవలను ప్రారంభించిన రాష్ట్రంగా హర్యానా రికార్డుల్లోకి ఎక్కింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారిని తమ సొంత ప్రాంతాలకు తరలించేందుకు బస్సు సేవలను ప్రారంభించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
రాష్ట్రంలోనే సేవలు..
ఇప్పటికే ఇతర రాష్ట్రాలకు చెందిన ఎంతో మందిని పంపుతున్నాం. రాష్ట్రంలో చిక్కుకుపోయిన ఇతర జిల్లాల ప్రజలను కూడా వారి గమ్యస్థానాలకు చేర్చాలని నిర్ణయించాం. అందుకే రాష్ట్రంలో అంతర్ జిల్లా బస్సు సేవలను ప్రారంభించినట్లు హర్యానా పోలీస్ చీఫ్ మనోజ్ యాదవ్ తెలిపారు. అయితే, బస్సు సేవలను ప్రారంభిస్తూనే కరోనా కట్టడికి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
Recommended Video
నిబంధనలు కఠినమే..
ఒకసారి బస్సు ఎక్కితే గమ్యస్థానం వరకూ ఎవరూ దిగడానికి వీల్లేదు. టికెట్లను కేవలం ఆన్లైన్ ద్వారానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి 29 మార్గాల్లో బస్సు సేవలను ప్రభుత్వం ప్రారంభించింది. అయితే, ఇప్పుడు ఏసీ బస్సులను మాత్రం నడపడం లేదని తెలిపింది. ఒక్కో బస్సులో 52 సీట్ల సామర్థ్యం ఉండగా, కేవలం 30 మంది ప్రయాణికులను మాత్రమే అనుమతిస్తున్నారు. హర్యానాలో ఇప్పటికే 35వేల పరిశ్రమలకు కార్యకలాపాలు చేసుకునేందుకు అనుమతిచ్చారు. కాగా, హర్యానాలో 854 కేసులు నమోదు కాగా, 464 మంది కోలుకున్నారు. 377 మంది చికిత్స పొందుతున్నారు. 13 మరణాలు చోటు చేసుకున్నాయి.