అసెంబ్లీ సమావేశాలకు 2 రోజుల ముందు... సీఎం,స్పీకర్లకు కరోనా పాజిటివ్...
హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కరోనా వైరస్ బారినపడ్డారు. గత కొద్దిరోజులుగా తనతో నేరుగా భేటీ అయినవారంతా ఐసోలేషన్లోకి వెళ్లాలని సూచించారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. హర్యానా అసెంబ్లీ స్పీకర్ గియన్ చంద్ గుప్తా కూడా కరోనా బారినపడ్డారు. అసెంబ్లీ సమావేశాలకు రెండు రోజుల ముందు సీఎం,స్పీకర్ ఇద్దరూ కరోనా బారినపడటం గమనార్హం.
'ఇవాళ నాకు కరోనా పాజిటివ్గా నిర్దారణ అయింది. గత వారం రోజులుగా నాతో నేరుగా భేటీ అయినవారంతా కరోనా పరీక్షలు చేయించుకోండి. తక్షణం క్వారెంటైన్లోకి వెళ్లండి.' అని సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ట్విట్టర్లో వెల్లడించారు.
స్పీకర్ గియన్ చంద్ గుప్తా కూడా కరోనా వైరస్ బారినపడినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి అనిల్ విజ్ తెలిపారు. దీంతో అగస్టు 26న మొదలయ్యే రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు డిప్యూటీ స్పీకర్ రణబీర్ గంగ్వా అధ్యక్షత వహించనున్నారు.
ఆరుగురు అసెంబ్లీ సిబ్బందికి కూడా కరోనా వైరస్ సోకిన నేపథ్యంలో శాసనసభ సమావేశాలకు హాజరయ్యే ఎమ్మెల్యేలందరూ కరోనా నెగటివ్ సర్టిఫికెట్తో రావాలని అసెంబ్లీ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. సర్టిఫికెట్ లేకుండా వచ్చేవారిని సభలోకి అనుమతించేది లేదని చెప్పారు. కాగా,ఇప్పటివరకూ హర్యానాలో 40,054 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 467మంది కరోనాతో మృతి చెందారు. ప్రస్తుతం 6143 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.