హర్యానా సీఎం అతడే.. హర్యానా కాంగ్రెస్ మాజీ ఛీప్ సంచలన వ్యాఖ్యలు
హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు హంగ్ దిశగా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు కసరత్తు చేస్తున్నాయి. ఈ క్రమంలో జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) పార్టీ చీఫ్ దుష్యంత్ చౌతాలా గురించి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మాజీ చీఫ్ అశోక్ తన్వర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనే రాష్ట్రానికి సీఎం అంటూ వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో అశోక్ తన్వర్ మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్ను హర్యానా ప్రజలు తిరస్కరించారు. అందుచేత చౌతాలాను ముఖ్యమంత్రి చేయడానికి రెండు పార్టీలు మద్దతివ్వాలి అని అన్నారు. ప్రస్తుతం తప్పనిసరి పరిస్థితుల్లో జేజేపీ నుంచి ముఖ్యమంత్రి కావాల్సిందే. ముఖ్యమంత్రి కావడానికి చౌతాలాకు సపోర్ట్ చేయాలి అని అన్నారు. అంతేకాకుండా ఆయనకు ఎవరు సపోర్ట్ చేయాలో కాంగ్రెస్, బీజేపీ తేల్చుకోవాలి అని సూచించారు.
మరో అడుగు ముందేసి తన్వర్ మాట్లాడుతూ.. దుష్యంత్ చౌతాలా నాకు సోదరుడి లాంటి వాడు. జేజేపీ చీఫ్తో ఇచ్చి పుచ్చుకొనే సంబంధాలు ఉన్నాయి. మా మధ్య స్నేహపూరిత రిలేషన్స్ ఉన్నాయి అని అన్నారు. అందుచేత నేను దుష్యంత్ చౌతాలాకు భేషరతుగా సపోర్టు చేస్తానని తెలిపారు. అంతేకాకుండా జేజేపీ మంచి అభ్యర్థులను పోటీలో నిలబెట్టిందని, వారి విజన్ హర్యానాలో యూత్ పాలిటిక్స్ దిశానిర్ధేశం చేసేలా ఉంది అని పేర్కొన్నారు.
కడపటి వార్తలు అందేసరికి హర్యానాలో ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరికీ సరైన మెజారిటీ లభించలేదు. బీజేపీ 40 సీట్లలో, కాంగ్రెస్ 30 సీట్లలో ఇతరులు 20 సీట్లలో అధిక్యంలో ఉన్నారు. ఈ సాయంత్రం సీఎం ఖట్టర్ ఆ రాష్ట్ర గవర్నర్ను కలిసేందుకు సిద్ధమవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.