సామాన్యుడు నేరస్తుడ్ని చంపొచ్చు: డీజీపీ సంచలనం
ఛండీగఢ్: హర్యానా డీజీపీ కేపీ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సామాన్యులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని ఉన్నతాధికారులు, న్యాయాధికారులు చెబుతుండటం సాధారణమే. కానీ, తమను చంపేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే వారిని సామాన్యులు చంపడం నేరం కాదని కేపీ సింగ్ తేల్చిచెప్పారు.
జాతీయ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం.. కేపీ సింగ్ శాంతిభద్రతలపై ప్రజలకు అవగాహన కల్పించే ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ సంచలనాత్మక సలహాలిచ్చారు.
'ఎవరో దుండగుడు వచ్చి సామాన్యుడి ఇంటిని తగులబెడుతూ ఉన్నా, సామాన్యుడిని హత్య చేయడానికి ప్రయత్నించినా, ఆ సామాన్యుడు చూస్తూ ఊరుకోనక్కర్లేదు. ఆ దుండగుడిని చంపేయవచ్చు' అని డీజీపీ సింగ్ స్పష్టం చేశారు. ఆ హక్కును చట్టం సామాన్యుడికి కల్పించిందన్నారు.
ఎవరైనా నేరస్థుడు ఓ మహిళను అవమానిస్తే సామాన్యుడు స్పందించి, ఆ నేరస్థుడి ప్రాణాలను తీయవచ్చునని అన్నారు. సామాన్యుడికి ఈ హక్కు చట్ట ప్రకారం లభించిందని తెలిపారు.
'పోలీసులు విధులు నిర్వహిస్తూ ఉంటారని, అయితే మీరు కూడా కామన్ మ్యాన్గా మీ పాత్రను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది' అని బోధించారు. కాగా, డీజీపీ మాటలు అక్కడున్న వారికి కొంత ఆశ్యర్యానికి గురిచేశాయి.