బీజేపీ సంచలనం -ప్రైవేటు ఉద్యోగాల్లో 75శాతం స్థానికులకే -బిల్లుకు హర్యానా గవర్నర్ ఆమోదం
బీజేపీ నేతృత్వంలోని హర్యానా ప్రభుత్వం సంచలన హామీని అమల్లోకి తీసుకొచ్చింది. హర్యానాలో ప్రైవేటురంగంలో 75 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లుకు ఆ రాష్ట్ర గవర్నర్ ఆమోదం తెలిపారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా మంగళవారం మీడియాకు వెల్లడించారు.
హర్యానాలో యువతకి ఇది సంతోషించదగ్గ రోజని, ఇకనుంచి ప్రైవేటు రంంలోని ఉద్యోగాల్లో స్థానిక యువత 75 శాతం వరకు రిజర్వేషన్ పొందొచ్చని డిప్యూటీ సీఎం చౌతాలా పేర్కొన్నారు. ఖట్టర్ సర్కారు 'ది హర్యానా స్టేట్ ఎప్లాయ్మెంట్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ బిల్లు' పేరిట గతేడాది ఈ బిల్లును తీసుకురాగా, మంగళవారంతో అది చట్టంగా మారింది.
ప్రైవేటు రంగంలో స్థానిక యువతకు 75 శాతం రిజర్వేషన్ కల్పన చట్టం.. నెలకు రూ.50 వేల వరకు వేతనాలతో నాలుగింట మూడు వంతుల ఉద్యోగాలను స్థానికులకు రిజర్వ్ చేసేందుకు ఉద్దేశించారు. ఒకవేళ అర్హులైన స్థానికులు అందుబాటులో లేకపోతే ప్రభుత్వ అనుమతితో కంపెనీలు వేరే ప్రాంతాల అభ్యర్థులను నియమించుకోవచ్చని ఓ క్లాజ్ కూడా ఈ చట్టంలో ఉంది.
కేంద్రంలోని మోదీ సర్కారు తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గడిచిన మూడు నెలలుగా జరుగుతోన్న నిరసనల్లో హర్యానా రైతులు కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో ఖట్టర్ సర్కారు ప్రైవేటు రంగంలో స్థానికులకు 75శాతం రిజర్వేషన్ చట్టాన్ని తేవడం చర్చనీయాంశమైంది.