మైనర్ బాలిక కిడ్నాప్: నాలుగు సార్లు అమ్మకం..ఏడుసార్లు గ్యాంగ్ రేప్: సూత్రధారులు మహిళలే..!
చండీగఢ్: తాజాగా వెలుగులోకి వచ్చిన మానవ అక్రమ రవాణా వ్యవహారం హర్యానాలో కలకలం రేపుతోంది. రాజకీయ ప్రకంపనలకు కారణమౌతోంది. ఎనిమిదేళ్ల కిందట మహారాష్ట్రలో మాయమైన ఓ బాలిక.. ఇద్దరు పిల్లల తల్లిగా హర్యానాలో తేలారు. ఈ ఎనిమిదేళ్ల కాలంలో ఆమె పలుమార్లు సామూహిక అత్యాచారానికి గురయ్యారు. కిడ్నాపర్లు ఆమెను నాలుగుసార్లు విక్రయించారు. అలా చేతులు మారుతూ చివరికి హర్యానాలో పోలీసుల చేతికి చిక్కారు.
ఛార్జిషీట్ లో దిగ్భ్రాంతికర విషయాలు..
ఈ అక్రమ రవాణా వెనుక మహిళలే ప్రధాన సూత్రధారులు కావడం.. పోలీసులను సైతం దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ఈ కేసులో మొత్తం పదిమందిని హర్యానా పోలీసులు అరెస్టు చేశారు. విచారణ సందర్భంగా వారు తమ నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులపై ఛార్జిషీట్ ను నమోదు చేశారు. ఈ ఛార్జిషీట్ లో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
మహారాష్ట్రలో కిడ్నాప్..
బాధిత బాలిక స్వస్థలం మహారాష్ట్రలోని చంద్రాపూర్. 13 ఏళ్ల వమస్సులో చంద్రాపూర్ లోని ఓ ఆలయం వద్ద ఆ బాలికను అపహరించారు. జాహ్నవి అనే మహిళ బాలికను కిడ్నాప్ చేశారని, అనంతరం లక్ష రూపాయలకు యునిత అలియాస్ సప్న షూటర్ అనే మహిళకు విక్రయించారని చార్జిషీట్ లో పేర్కొన్నారు. బాధిత బాలికను కొనుగోలు చేసిన యునిత.. హిమాచల్ ప్రదేశ్ లోని నహన్ పట్టణానికి చెందిన ఓ భూస్వామికి బాలికను విక్రయించినట్లు తమ దర్యాప్తులో తేలింది.
హిమాచల్ ప్రదేశ్, హర్యానాల్లో నరకం..
అక్కడే ఆ బాలిక చిత్రహింసలకు గురయ్యారని, లైంగిక దాడి బారిన పడ్డారు. రెండేళ్ల పాటు హిమాచల్ ప్రదేశ్ లో నిర్బంధంలో గడిపిన తరువాత ఆ భూస్వామి ఆమెను హర్యానాలోని కర్నాల్ కు చెందిన నలగురికి లక్ష రూపాయలకు ఆ బాలికను విక్రయించాడు. కర్నాల్ లో నలుగురు వ్యక్తులు 20 రోజుల పాటు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అక్కడి నుంచి రెండుసార్లు ఆమె విక్రయానికి గురయ్యారు. నారాయణ్ గఢ్, యమునానగర్ లకు తరలించారు. ఆమె వ్యభిచార కూపంలోకి దింపారు.
స్వచ్ఛంద సంస్థ ప్రతినిధుల సహకారంతో..
చివరికి యమునా నగర్ లో ఈ దురాగతానికి అడ్డుకట్ట పడింది. ఈ వ్యవహారం అంతా ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులకు తెలియడంతో వారు రంగంలోకి దిగారు. స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు సునీల్, సంజీవ్ యమునా నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. యమునా నగర్ లో ధరంవీర్ అనే స్థానిక రౌడీషీటర్ నిర్బంధంలో ఉన్న బాధితురాలిని కాపాడారు. దీనికోసం స్వచ్ఛంద సంస్థ ప్రతినిధుల సహకారాన్ని తీసుకున్నారు.
నిందితుల కోసం గాలింపు..
ఈ కేసులో సప్నా, ఆమె కుమారుడు విక్కీ, కుమార్తె నిక్కీ, ధరంవీర్, కృష్ణ షెవరాన్, రాకేష్ కుమార్, కమలా దేవి, జయ్ సింగ్, సునీల్ అలియాస్ సోను, జాహ్నవిలపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వారిలో కొందర్ని అరెస్టు చేశారు. మరి కొందరి కోసం గాలిస్తున్నారు. ప్రధాన నిందితురాలు జాహ్నవి కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు. సెల్ ఫోన్ నంబర్ల ఆధారంగా జాహ్నవి సహా మరి కొందరు నిందితుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.