హరియాణాలో బీజేపీకి మద్దతు ఇచ్చే ఆలోచన లేదు, కింగ్ మేకర్ చౌటాలా, చర్చలు లేవు!!
చండీగడ్: హరియాణాలో హంగ్ అసెంబ్లీ ఏర్పడటంతో దేశ రాజకీయాల్లో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు దుశ్యంత్ చౌటాలా. హరియాణాతో పాటు దేశ వ్యాప్తంగా అందరి దృష్టి దుశ్యంత్ చౌటాలాపై మళ్లింది. దుశ్యంత్ చౌటాలా బీజేపీకి మద్దతు ఇస్తారా ? లేదా కాంగ్రెస్ కు మద్దతు ఇస్తారా అని చర్చ మొదలైయ్యింది. 90 శాసన సభ సీట్లు ఉన్న హరియాణాలో జననాయక్ జనతా పార్టీ (JJP) మద్దతు కోసం బీజేపీ, కాంగ్రెస్ ఎదురు చూస్తోంది. అయితే హరియాణాలో కింగ్ మేకర్ అయిన జేజేపీ చీఫ్ దుశ్యంత్ చౌటాలా ప్రముఖ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ తాను బీజేపీకి మద్దతు ఇచ్చే విషయం ఇంకా ఆలోచించలేదని బాంబు పేల్చారు.
హరియాణాలో జాట్ల దెబ్బకు బీజేపీ, కాంగ్రెస్ ఔట్, ముత్తాత పేరు లక్కీ, జైలు దెబ్బ!
బీజేపీతో చర్చలు లేవు
బీజేపీకి మద్దతు ఇచ్చే విషయంలో తాను ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని, ఆ ఆలోచన లేదని జేజేపీ చీఫ్ దుశ్యంత్ చౌటాలా అన్నారు. ఇంత వరకూ బీజేపీతో తాను ఎలాంటి చర్చలు జరపలేదని దుశ్యంత్ చౌటాలా చెప్పారు. హరియాణా ప్రజల ప్రయోజనాల కోసం తాను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని దుశ్యంత్ చౌటాలా అన్నారు.
శిరోమణి అకాలి దళ్ తో మాట్లాడారా ?
శిరోమణి అకాలి దళ్ నాయకుడు బాదల్ తో మాట్లాడాలని బీజేపీ నాయకులు మీకు సూచించారా అనే ప్రశ్నకు తాను ఇంత వరకూ ఎవరితో మాట్లాడలేదని దుశ్యంత్ చౌటాలా అన్నారు. హరియాణా జననాయక్ జనతా పార్టీ ఎమ్మెల్యేలతో మొదట మాట్లాడి వారి నిర్ణయం ఏమిటి ? అని విషయం తెలుసుకుంటానని దుశ్యంత్ చౌటాలా తెలిపారు.
ఢిల్లీలో ఎమ్మెల్యే గోపాల్ కందా
మీరు బీజేపీకి లేదా కాంగ్రెస్ మద్దతు ఇచ్చే విషయంలో ఓనిర్ణయం తీసుకోకుండా ఎందుకు ఆలస్యం చేస్తున్నారు అంటే ముందు మా జేజేపీ శాసన సభ్యుల సమావేశంలో చర్చించి ఏం చెయ్యాలి అనే నిర్ణయం తీసుకోవాలి కదా అని దుశ్యంత్ చౌటాలా సమాధానం ఇచ్చారు. ఇప్పటికే స్వతంత్ర పార్టీ ఎమ్మెల్యే గోపాల్ కందా ఢిల్లీ చేరుకుని బీజేపీకి మద్దతు ఇచ్చారు, మీరు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు అంటే అది ఆయన ఇష్టం, మా సిద్దాంతాలు మాకు ఉంటాయి కాదా అని దుశ్యంత్ చౌటాలా అన్నారు.
నా తండ్రి ఆశయం
గత సంవత్సరం నవంబర్ 17వ తేదీ మేము జననాయక్ జనతా పార్టీ స్థాపించామని, ఇంత వరకు ప్రయాణం చేశామని దుశ్యంత్ చౌటాలా అన్నారు. మా తండ్రి అజయ్ సింగ్ చౌటాలా జేజేపీని ముందుకు తీసుకెళ్లి ప్రజల్లో మంచి పేరు తీసుకురావాలని ఆశ పడ్డారని దుశ్యంత్ చౌటాలా అన్నారు. మా త్రండి అజయ్ సింగ్ చౌటాలా ఆలోచనలను, ఆశయాలను ఈ రోజు పూర్తి చేశామని అనుకుంటున్నానని జేజేపీ చీఫ్ దుశ్యంత్ చౌటాలా అన్నారు.
ఎమ్మెల్యేలు జంప్ జిలాని ?
జననాయక్ జనతా పార్టీ ఎమ్మెల్యేల సమావేశం జరుపుతామని, వారి అభిప్రయాలు తెలుసుకుని ఆ మేరకు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తామని దుశ్యంత్ చౌటాలా అన్నారు. జేజేపీ ఎమ్మెల్యేలు ఎవరి ప్రలోభాలకు లొంగరని మా పార్టీ నుంచి జంప్ కారని,, అందరూ మా వెంటే ఉంటారని దుశ్యంత్ చౌటాలా ధీమా వ్యక్తం చేశారు. జేజేపీని ఆదరించిన హరియాణా ప్రజలకు, ముఖ్యంగా జూట్లకు దుశ్యంత్ చౌటాలా ధన్యవాదాలు తెలిపారు.