టీచర్ల నియామక కుంభకోణం: మాజీ ముఖ్యమంత్రి చౌతలాకు పదేళ్ల జైలు
న్యూఢిల్లీ: హర్యానా మాజీ ముఖ్యమంత్రి చౌతాలా, ఆయన కుమారుడు సహా మొత్తం ఏడుగురికి అధ్యాపకుల నియామక కుంభకోణం కేసులో పదేళ్ల కారాగార శిక్షను ఢిల్లీ హైకోర్టు గురువారం ధ్రువీకరించింది. కీలక పదవుల్లో ఉన్న వ్యక్తులు ఇంత తీవ్ర స్థాయిలో కుంభకోణానికి పాల్పడటాన్ని చూస్తే దేశ పాలనా వ్యవహారాలు ఎంత దిగ్భ్రాంతికర రీతిలో సాగుతున్నాయో అర్థమవుతోందని హైకోర్టు తన ఉత్తర్వులో పేర్కొంది.
అయితే గతంలో ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పు పాఠంలో కొన్ని సవరణలు చేసింది. ఈ కేసులో మరో 50మందికి రెండేళ్ల జైలుశిక్షను విధించింది. మొత్తం 400 పేజీల తీర్పును న్యాయమూర్తి సిద్ధార్థ్ మృదుల్ ఇచ్చారు. మొత్తం హర్యానాలోని 18 జిల్లాలకు సంబంధించిన ఉపాధ్యాయ నియామక వ్యవహారం అప్పట్లో ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తుల చేతుల్లోనే సాగిందని, మొత్తం బ్యూరోక్రసీ అంతా దాని అడుగులకు మడుగులొత్తిందని న్యాయమూర్తి తెలిపారు.
ఈ కేసుకు సంబంధించి అప్పీళ్లన్నింటినీ తిరస్కరిస్తున్నామని వెల్లడించారు. ముడుపుల కోసం టీచర్ల నియామక ప్రక్రియను చౌతాలా ద్వయంతోపాటు నాటి సీఎం సలహాదారు షేర్సింగ్ బాద్షామీ, మరో ఇద్దరు ఐఏఎస్ అధికారులు విద్యాధర్, సంజీవ్ కుమార్ అపహాస్యంచేశారని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. యువతకు స్ఫూర్తిదాయకంగా నిలవాల్సిన చౌతాలా వారిని మోసగించినందుకు పదేండ్ల జైలుశిక్షకు అర్హుడేనని పేర్కొంది.
వృద్ధుడినైన తనను కనికరించాలన్న ఓంప్రకాశ్ చౌతాలా విజ్ఞప్తిని న్యాయస్థానం తిరస్కరించింది. ఇటువంటి కుంభకోణాలు వ్యవస్థలపై ప్రజలు విశ్వాసం కోల్పోయే ప్రమాదం ఉందని జస్టిస్ సిద్దార్థ్ మృదుల్ ఆందోళన వ్యక్తంచేశారు. నిందితులు దిగ్భ్రాంతికరమైన రీతిలో వ్యవస్థకు తూట్లు పొడిచారన్నారు. 2000లో జరిగిన 3206 మంది టీచర్ల నియామక కుంభకోణంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2003 నవంబర్ 23న సీబీఐ విచారణ చేపట్టింది.