నిజం ఒప్పేసుకున్నారు: ప్రద్యుమన్ హత్య కేసులో పోలీసులు కావాలనే ఇలా!..
మంగళవారం రాత్రి 11గం. సమయంలో మైనర్ అయిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
న్యూఢిల్లీ: రియాన్ స్కూల్లో చోటు చేసుకున్న ప్రద్యుమన్ హత్య కేసులో పోలీసులపై అనుమానాలు వ్యక్తమవుతూ వచ్చిన సంగతి తెలిసిందే. తాజా విచారణలో ఆ అనుమానాలు నిజమేనని తేలింది.
జరిగింది అది కాదు: ఆధారాలు ఎలా మాయం అయ్యాయ్?, ప్రద్యుమన్ హత్య వెనుక సంచలనాలు..
గురుగ్రామ్ పోలీస్ కమిషనర్ సందీప్ ఖిర్వాల్.. ప్రద్యుమన్ కేసును విచారించిన పోలీసులను పిలిపించి విచారించారు. దీంతో వారు నిజాలు ఒప్పుకున్నారు. కండక్టర్ను ఇరికించేందుకే వారు ప్రయత్నించినట్టు విచారణలో వెల్లడైనట్టు తెలుస్తోంది.
లేనిపోనివి కల్పించి
ప్రద్యుమన్ హత్య కేసుకు సంబంధించి కండక్టర్ అశోక్ కుమారే నిందితుడు అని పోలీసులు గట్టిగా వాదిస్తూ వచ్చారు. చిన్న పిల్లలతో అతనికి అసహజ శృంగార అలవాటు ఉందని, ప్రద్యుమన్ ను వేధించి అతనే హత్య చేశాడని లేని పోనివన్ని కల్పించి చెప్పారు.
ఒప్పుకున్న పోలీసులు
ఇటీవల అసలు నిందితుడు పట్టుబడటంతో పోలీసుల విచారణపై అనుమానాలు బలపడ్డాయి. తాము పొరబడ్డామని, సీసీటీవి ఫుటేజీలు కూడా సరిగా చూడలేదని తాజా విచారణలో ఒప్పుకున్నారు. సీసీటివి ఫుటేజీని పరిశీలిస్తే.. ప్రద్యుమన్ ను నిందితుడు బాత్రూం వైపు పిలుస్తున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది.
ఇంత స్పష్టంగా ఫుటేజీలో కనిపిస్తున్నా.. ఎందుకు దాన్ని వదిలిపెట్టారని కమిషనర్ ప్రశ్నించారు. దీనికి పోలీసుల వద్ద సమాధానం లేకుండా పోయింది.
అసలు నిందితుడు పట్టుబడటంతో
కేసును సీబీఐకి అప్పగించాక కానీ అసలు నిందితుడు పట్టుబడలేదు. గత మంగళవారం రాత్రి 11గం. సమయంలో మైనర్ అయిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అంతకుముందు అతని తల్లిదండ్రులకు పరిస్థితిని వివరించారు. కేవలం స్కూల్లో పేరెంట్స్-టీచర్ మీటింగ్ వాయిదా వేసేందుకే నిందితుడు ఇంత ఘోరానికి ఒడిగట్టాడు.
బస్ డ్రైవర్ను కూడా హింసించారా?
నిందితుడి తల్లిదండ్రులు మాత్రం తమవాడు నిర్దోషి అని ఆరోపిస్తున్నారు. మరోవైపు ఇన్నాళ్లు లేని ఆరోపణలతో బస్ కండక్టర్ అశోక్ కుమార్ ను పోలీసులు వేధించడాన్ని చాలామంది తప్పుపడుతున్నారు. పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని అతని కుటుంబం కూడా డిమాండ్ చేస్తోంది.
అశోక్ అరెస్టు సమయంలో పోలీసులు రక్తంతో ఉన్న కత్తిని కూడా చూపించారు. పోలీసులు తాజా విచారణలో వెల్లడించిన విషయాలను బట్టి చూస్తే.. అవన్ని తప్పుడు ఆధారాలే అన్న అనుమానాలు కలుగుతున్నాయి. బస్ డ్రైవర్ సౌరవ్ రాఘవ్ ను కూడా పోలీసులు హింసించారన్న ఆరోపణలను విచారణలో తేల్చనున్నారు.