కాంగ్రెస్ టికెట్లు అమ్ముకుంది: ఆరోపణల మధ్యే హర్యానా కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల
న్యూఢిల్లీ: హర్యానాలో ఎన్నికల హీట్ ప్రారంభమైంది. ఇప్పటికే బీజేపీ పోటీలో నిల్చుంటున్న తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేయగా ... తాజాగా కాంగ్రెస్ 84 మందితో కూడిన జాబితాను విడుదల చేసింది. పేర్లు విడుదల కావడంతో అభ్యర్థులు ప్రచార రంగంలోకి దిగారు. హర్యానా అసెంబ్లీలో మొత్తం 90 సీట్లు ఉన్నాయి.
న్యూఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో అనేక నాటకీయపరిణామాల మధ్య హర్యానా అసెంబ్లీ అభ్యర్థుల పేర్లను విడుదల చేసింది కాంగ్రెస్. అయితే హర్యానా కాంగ్రెస్ మాజీ పీసీసీ అధ్యక్షుడు అశోక్ తన్వార్ తన మద్దతుదారులతో ఏఐసీసీ కార్యాలయం ముందు నిరసనలు చేపట్టారు. టికెట్లను అమ్ముకుంటున్నారని ఆరోపణలు చేశారు. తన్వార్కు ఈ సారి పోటీచేసేందుకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదు. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ నివాసం 10 జన్పథ్లో తన్వార్ మద్దతుదారులు మేనేజ్మెంట్ కమిటీ చీఫ్ భూపేందర్ హూడాకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు.
Congress releases a list of 84 candidates for the upcoming elections to the legislative assembly of Haryana. BS Hooda to contest from Garhi Sampla-Kiloi, Randeep Surjewala from Kaithal, Kuldeep Bishnoi from Adampur & Kiran Chaudhary to contest from Tosham. #HaryanaAssemblyPolls pic.twitter.com/jRMGWyK1iN
— ANI (@ANI) October 2, 2019
సోనా నియోజకర్గం టికెట్ను అమ్ముకున్నారని ఆరోపణలు చేశారు తన్వార్. ఇక్కడ శంషుద్దీన్కు కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించింది. ఇక కర్నాల్ నుంచి పోటీ చేస్తున్న ముఖ్యమంత్రి ఖట్టర్ పై తర్లోచన్ సింగ్ను బరిలోకి దింపింది కాంగ్రెస్. మాజీ ముఖ్యమంత్రి హూడా గర్హి సంప్లా నియోజకవర్గం నుంచి బరిలో దిగనున్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సూర్జేవాలా ఖైతల్ నియోజకవర్గం నుంచి పోటీచేయనున్నారు.
ఇక ఇతర ప్రముఖ నాయకులను పరిశీలిస్తే... తోషమ్ నియోజకవర్గం నుంచి కిరణ్ చౌదరి, అదంపూర్ నుంచి కుల్దీప్ బిష్ణోయ్, పంచకుల నుంచి చంద్రమోహన్లు పోటీ చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ కుమారులు చంద్రమోహన్ మరియు బిష్ణోయ్ . ఇక 17 సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో కాంగ్రెస్ పార్టీ 16 మందికి తిరిగి టికెట్ కేటాయించగా... బిష్ణోయ్ భార్య రేణుకకు టికెట్ తిరస్కరించింది. మాజీ అసెంబ్లీ స్పీకర్ కుల్దీప్ శర్మ గానౌ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. మాజీ మంత్రి గీతా బుక్కల్ జజ్జర్ స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు. ఆనంద్ సింగ్ దంగి తన సొంత నియోజకవర్గం మెహమ్ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక టికెట్ దక్కని ప్రముఖుల్లో తన్వార్ మరియు హర్యానా కాంగ్రెస్ చీఫ్ కుమార్ సెల్జాలు ఉన్నారు.