మధ్యాహ్నా భోజనంలో పాముపిల్ల!: హడలెత్తిన విద్యార్థులు, ఏంటీ దారుణం.
నాణ్యత లేని ఆహారం అందించడం ఎప్పటినుంచో కొనసాగుతుందని, అయితే ఇలా పాముపిల్ల రావడం మరీ దారుణం అని విద్యార్థులు వాపోయారు.
ఫరిదాబాద్: హర్యానాలోని ఓ ప్రభుత్వ పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యానికి అద్దం పట్టే ఘటన ఇది. ఏకంగా విద్యార్థులు తినే మధ్యాహ్నాం భోజనంలో ఓ పాము పిల్ల దర్శనమిచ్చిందంటే.. వారి పనితీరు ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఫరీదాబాద్ లోని రాజ్కేయా బాలికల సీనియర్ పాఠశాలలో గురువారం ఈ సంఘటన చోటు చేసుకుంది.
మధ్యాహ్నా భోజన సమయంలో.. విద్యార్థులంతా భోజనం చేస్తుండగా.. ఓ విద్యార్థిని తింటున్న భోజనంలో చచ్చిన పాముపిల్ల కనిపించింది. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన విద్యార్థిని తోటి విద్యార్థినులకు విషయం చెప్పింది. ఆపై విద్యార్థులంతా భోజనం తినడం ఆపేశారు. కొంతమంది విద్యార్థులు వాంతులు కూడా చేసుకున్నారు.
నాణ్యత లేని ఆహారం అందించడం ఎప్పటినుంచో కొనసాగుతుందని, అయితే ఇలా పాముపిల్ల రావడం మరీ దారుణం అని విద్యార్థులు వాపోయారు. విద్యార్థుల ఫిర్యాదుతో అప్రమత్తమైన ప్రిన్సిపాల్.. భోజనం సరఫరా చేసే ఇస్కాన్ ఫౌండేషన్ యాజమాన్యానికి ఫోన్ చేసి విషయం చెప్పారు. వేరే స్కూల్స్ కు పంపించిన భోజనాన్ని నిలిపివేయాల్సిందిగా ఆదేశాలిచ్చారు. అనంతరం పరీక్షల నిమిత్తం ఆ ఆహార పదార్థాలను ల్యాబ్కు పంపించారు.