సీఎం పూర్వీకుల గ్రామంలో పాపులర్ సింగర్ మమత అనుమానాస్పద మృతి
రోహతక్: హర్యానాలో సాక్షాత్తూ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టార్ పూర్వీకుల గ్రామంలో ఓ మహిళా గాయని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఇది సంచలనం రేపింది. నాలుగు రోజుల క్రితం గాయని మమతా శర్మ అదృశ్యమైంది.
ఆ తర్వాత ఆమె రోహతక్ జిల్లా బాలియానీ గ్రామంలో విగతజీవిగా కనిపించారు. జనవరి 14వ తేదీన గొహనా కార్యక్రమం ఉందని చెప్పి ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయింది. బాలియాని గ్రామంలోని పొలాల్లో ఆమె మృతదేహాన్ని గుర్తించారు.
మమతా శర్మది హత్యగా అనుమానం
మమతా శర్మను హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఆమె గొంతు కోసిన ఆనవాళ్లను పోలీసులు గుర్తించారు. కల్ నౌర్ ప్రాంతవాసి అయిన మమత ప్రముఖ హరియాణావి గాయకురాలిగా సుపరిచితులు. భజన పాటలు పాడటంలో ఆమె పేరుగాంచారు.
పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
మమతా శర్మ అదృశ్యమైనట్లు స్థానిక పోలీస్ స్టేషన్లోను ఫిర్యాదు అందింది. ఆమె జనవరి 14వ తేదీ నుంచి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మృతికి సంబంధించి పోలీసులు విచారణ జరుపుతున్నారు.
పతాకశీర్షికల్లో
కాగా, గత ఐదు రోజుల్లో ఆరు అత్యాచార కేసులు, గ్యాంగ్ రేప్లు చోటు చేసుకోవడంతో హర్యానా పతాకశీర్షికల్లో నిలిచింది. మహిళలపై అఘాయిత్యాలను నిలువరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
బెదిరింపులు
మరోవైపు, రెండు నెలల క్రితం పాపులర్ హర్యాన్వీ సింగర్ హర్షితా దహియా పానిపట్లో మృతి చెందారు. ఈ ఏడాది జనవరి 3న మరో హర్యానీ సింగర్ కమ్ డ్యాన్సర్ ఆర్తి భోరియా తనకు బెదిరింపులు వస్తున్నాయని ఫిర్యాదు చేసింది.