బీజేపీలో చేరిన సప్న చౌదరీ..
ఢిల్లీ : బిగ్బాస్ కంటెస్టెంట్, హర్యానా జానపద గాయని, డ్యాన్సర్ సప్నా చౌదరీ బీజేపీలో చేరారు. ఆమె కమలం పార్టీలో చేరుతారని కొన్ని నెలలుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం ఢిల్లీలోని జవహర్ లాల్ స్టేడియంలో నిర్వహించిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో సప్నా పార్టీ సభ్యత్వం తీసుకున్నారు.
బీజేపీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సప్నా చౌదరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జనరల్ సెక్రటరీ రాంలాల్, ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ తదితరులు పాల్గొన్నారు.
2019 సార్వత్రిక ఎన్నికల్లో సప్నా చౌదరి బీజేపీకి మద్దతుగా ప్రచారం చేశారు. ఢిల్లీలో సుడిగాలి పర్యటనలతో హోరెత్తించారు. సింగర్, డ్యాన్సర్గానే కాకుండా బిగ్ బాస్ 11 సీజన్లో పాల్గొన్న ఆమెకు ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఎన్నికల ముందు ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరుతుందని ఊహాగానాలు వచ్చాయి. అయితే ఆమె ఆ వార్తల్ని ఖండించారు.