నా అర్హత ఎక్కువ: నితీష్, చనిపోయారా: ములాయం
లక్నో/పాట్నా: ప్రధానమంత్రి పదవికి తన అర్హత చాలా ఎక్కువ అని బీహార్ ముఖ్యమంత్రి, జెడి(యు) నేత నితీష్ కుమార్ గురువారం అన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి పదవి కోసం తాపత్రయ పడుతున్న వారితో పోలిస్తే ఆ పదవికి ఉండాల్సిన అర్హత, అనుభవం తనకే ఎక్కువ అన్నారు.
తద్వారా తాను ప్రధాని రేసులో ఉన్నానని నితీశ్ కుమార్ చాటుకున్నారు. బెట్టియాలో 'సంకల్ప్ యాత్ర' సందర్భంగా ఆయన పై వ్యాఖ్యలు చేశారు. దేశంలో ప్రధాని పదవి కోసం వెంపర్లాడుతున్న వారి కంటే తను ఎన్నో విధాలా అర్హుణ్ణి అన్నారు. ఒకరికి పార్లమెటు అనుభవం లేదని మోడీని ఉద్దేశించి, మరొకరికి రాష్ట్రాన్ని నడిపించిన అనుభవం లేదని రాహుల్ గాంధీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
తనకు ఆ రెండు అనుభవాలు ఉన్నాయని చెప్పారు. వారిద్దరికంటే తాను తీసిపోయానా...? రెండు విధాలా నేను అనుభవజ్ఞుణ్ణే అన్నారు. ఎన్నికల అనంతరం మూడో ఫ్రంట్ అతిపెద్ద కూటమిగా నిలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ములాయం కౌంటర్లు
సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షులు ములాయం సింగ్ యాదవ్ లక్నోలో మీడియా ప్రతినిధులపై కౌంటర్లు విసిరారు. ఉత్తరప్రదేశ్లో డాక్టర్ల సమ్మెతో రోగులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని ఓ పాత్రికేయుడు ప్రశ్నించగా, మీ ఇంట్లో ఎవరైనా వైద్యం అందక చనిపోయారా? అని ప్రశ్నించారు.
దీంతో, ఆ మీడియా ప్రతినిధి అవాక్కయ్యాడు. మీడియా సవ్య రీతిలో వార్తలు రాస్తే డాక్టర్ల సమ్మె దానంతటదే ఆగిపోతుందని ములాయం అన్నారు. వైద్యుల సమ్మెను ఎందుకు భూతద్దంలో చూపుతారని ప్రశ్నించారు.