మమత బాధించారు, వాజ్పేయి విగ్రహావిష్కరణకు డుమ్మా, ప్రతినిధిని కూడా పంపలేదన్న గవర్నర్
పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, గవర్నర్ జగ్దీప్ ధన్కర్ మధ్య విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. రాజ్భవనలో మాజీ ప్రధానమంత్రి అటల్ బీహరి వాజ్పేయి విగ్రహావిష్కరణ కోసం ఆహ్వానిస్తే దీదీ డుమ్మాకొట్టారు. అంతేకాదు తన ప్రతినిధులను కూడా పంపించలేదు. దీనిపై గవర్నర్ జగ్దీప్ స్పందిస్తూ.. మమత వైఖరితో తనకు బాధ కలిగిందన్నారు.
మమతా బెనర్జీ, జగ్దీప్ మధ్య ఇప్పుడే కాదు ఈ ఏడాది జూలైలో గవర్నర్గా నియమించినప్పటి నుంచి వారి మధ్య సఖ్యత లేదు. ఐదు నెలల్లో శాంతి భద్రతలు, వర్సిటీల్లో గొడవ తదితర అంశాలపై ఇద్దరి మధ్య ఘర్షణ నెలకొంది. కానీ వాజ్పేయ్ విగ్రహావిష్కరణకు కూడా మమత హాజరుకాలేదు. మరో విషయమేమిటంటే 2001 నుంచి 2004 వరకు వాజ్పేయి ప్రభుత్వంలో మమతా బెనర్జీ కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు.
బుధవారం వాజ్పేయి జయంతి సందర్భంగా మమతా బెనర్జీ అంజలి ఘటించారు. ఉదయమే ట్వీట్ కూడా చేశారు. కానీ రాజ్భవన్లో జరిగిన కార్యక్రమానికి మాత్రం హాజరుకాలేదు. సీఎం, మంత్రులు, అధికారులు కూడా రాకపోవడం చర్చకు దారితీసింది. దీనిపై గవర్నర్ జగ్దీప్ స్పందిస్తూ.. సీఎంకు చాలా పనులు ఉంటాయి, ఆ విషయం తనకు తెలుసు అని.. కానీ ఆమె తన తరఫున ఒక ప్రతినిధిని పంపించిన సరిపోయేదని చెప్పారు. కార్యక్రమానికి సంబంధించి తాను గత నెలలోనే వారికి ఆహ్వానాలు పంపించినట్టు గుర్తుచేశారు.