హద్దు మీరారు ..వేటు పడింది: అనురాగ్, పర్వేష్ సింగ్లపై నిషేధం విధించిన ఈసీ
ఢిల్లీ: ఢిల్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న నాయకులపై ఈసీ కొరడా ఝుళిపిస్తోంది. ఇందులో భాగంగానే కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్, మరియు బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మలు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఈసీ సీరియస్గా తీసుకుంది. కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా మూడు రోజుల పాటు నిషేధం విధించగా... మరో బీజేపీ ఎంపీ పర్వేష్ సింగ్పై 96 గంటలపాటు అంటే నాలుగు రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనరాదని ఆదేశాలు జారీ చేసింది. దీంతో బీజేపీ తరపున స్టార్ క్యాంపెయినర్ల జాబితా నుంచి వీరి పేర్లు తొలిగినట్లయ్యింది.
నమ్మక ద్రోహులను కాల్చి పారేయండి అని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ఎన్నికల ప్రచారం సందర్భంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మరోవైపు షాహీన్బాగ్లో సీఏఏకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తున్న నిరసనకారులను అనుచిత వ్యాఖ్యలు చేశారు. వారంతా ఇళ్లల్లోకి జొరబడి మహిళలు కూతుళ్లపై అత్యాచారం చేస్తారనే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఎంపీ పర్వేష్ వర్మ. అయితే వీరిపై నిషేధం ముగిసిన తర్వాత మళ్లీ వీరు ప్రచారం నిర్వహించొచ్చు. అయితే స్టార్ క్యాంపెయినర్ల జాబితా నుంచి తొలగించారంటే ఇక పై వీరి ఖర్చులు అభ్యర్థి చేసే ఖర్చుల జాబితాలోకి చేరిపోతాయి. అభ్యర్థి ఖర్చులు రూ.28 లక్షల కంటే ఎక్కువగా ఖర్చు చేయరాదంటూ ఈసీ పరిమితి విధించింది. స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఉన్నవారికి మాత్రం ఈ ఖర్చుల నుంచి మినహాయింపు ఉంటుంది.
ఈ సోమవారం రోజున కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రచారం నిర్వహిస్తే నమ్మకద్రోహులను కాల్చిపారేయాలి అన్న వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్ అక్కడే ఉన్న కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. మనీష్ చౌదరీ తరపున ఆయన ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో దేశంలో ఉండే నమ్మకద్రోహులను అనే ఠాకూర్ ఉచ్చరించగానే సభలోని వారంతా కాల్చిపారేయాలని నినదించారు. ఇక తన వ్యాఖ్యలను సమర్థించుకునే ప్రయత్నం చేశారు అనురాగ్ ఠాకూర్. వీడియోను పూర్తిగా చూస్తే ఢిల్లీ ప్రజల మూడ్ ఎలా ఉందో అర్థమవుతుందని అన్నారు.
ఠాకూర్ వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే వెస్ట్ డిల్లీ ఎంపీ పర్వేష్ వర్మ షాహీన్ బాగ్ నిరసనకారులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. షాహీన్బాగ్లో సీఏఏను వ్యతిరేకిస్తూ లక్షలమంది నిరసనలు తెలిపారని వారిని అలానే వదిలేస్తే ఇళ్లల్లోకి చొరబడి అక్కచెల్లెలపై అత్యాచారం చేసి చంపేస్తారనే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఆలోచించి ఓటు వేయాలని రేపు ఇలాంటిదేమైనా జరిగితే కాపాడేందుకు మోడీ లేదా అమిత్ షాలు రారని అన్నారు. వికాస్పురి ర్యాలీలో పాల్గొని ప్రసంగించిన పర్వేష్ వర్మ... ఢిల్లీలో బీజేపీ సర్కార్ వచ్చిన గంటలోపే నిరసనకారుల భరతం పడుతామని అన్నారు. అంతేకాదు అధికారంలోకి వచ్చిన నెలలోపే ప్రభుత్వ భూముల్లో ఉన్న మసీదులను తొలగిస్తామంటూ పర్వేష్ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.