అట్టుడుకుతోన్న హత్రాస్:144 సెక్షన్ - సరిహద్దులు మూసివేత - రాహుల్, ప్రియాంక రాక - బీజేపీ ఎదురుదాడి
నిర్భయ, దిశ అంతటి స్థాయిలో మళ్లీ దేశాన్ని కదలించిన హత్రాస్ గ్యాంగ్ రేప్ ఘటనపై నిరసనలు, ఆందోళనలు ఊపందుకున్నాయి. ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ జిల్లా కేంద్రానికి సమీపంలోని బూలాగరి గ్రామంలో 19 ఏళ్ల యువతిపై అదే ఊరికి చెందిన అగ్రకులం యువకులు అత్యాచారానికి పాల్పడి, వెన్నుపూస, ఇతర ఎముకలు విరిగేలా దారుణంగా కొట్టడంతో చికిత్స పొందుతూ ఆమె మరణించింది. కనీసం మృతదేహాన్ని కుటుంబానికి అప్పగించకుండా, పోలీసులే రాత్రికిరాత్రే దహనం చేయడం ఈ ఘటనలో మరో పాశవిక అంశం. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలంటూ బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు ఆందోళనకు దిగాయి. ఈ క్రమంలోనే..
రాహుల్, ప్రియాంక రాక
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ గురువారం హత్రాస్ బాధిత కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఉదయం ఢిల్లీ నుంచి కారులో బయలుదేరిన అన్నాచెల్లెళ్లు ఇప్పటికే యూపీ సరిహద్దులు దాటారు. అడుగడుగునా కాంగ్రెస్ శ్రేణులు నినాదాలు చేస్తూ వారికి స్వాగతం పలికారు. గ్యాంగ్ రేప్ చేసి చంపడమే దారుణమైతే, కనీసం యువతి మృతదేహాన్ని కుటుంబానికి ఇవ్వకపోవడం అత్యంత జుగుప్సకలిగిస్తున్నదని రాహుల్, ప్రియాంక వ్యాఖ్యానించారు. అయితే..
హత్రాస్ సరిహద్దులు సీల్, 144 సెక్షన్
హత్రాస్ జిల్లాలో జరిగిన సామూహిక అత్యాచారం, హత్యపై తీవ్ర నిరసన పెల్లుబుకడంతో.. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా అధికార యంత్రాంగం ముందస్తు చర్యలకు ఉపక్రమించింది. జిల్లా వ్యాప్తంగా గురువారం నుంచి నిషేధాజ్ఞలు విధిస్తున్నట్టు కలెక్టర్ పీకే లక్షకర్ ప్రకటించారు. ఇటు కాంగ్రెస్ జాతీయ నేతలు ప్రియాంక, రాహుల్ వస్తుండటం, అటు అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీ సైతం ఆందోళనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో అధికార యంత్రాంగం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. హత్రాస్ జిల్లా అంతటా ఈ నెల 31 వరకు సెక్షన్ 144 విధింపు ఉంటుందని, జిల్లా సరిహద్దులను కూడా మూసివేస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు.
బూలాగరి గ్రామంలో భారీ నిరసనలు
హత్రాస్ జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ విధించినప్పటికీ ఆందోళనకారులు వెనక్కి తగ్గడంలేదు. గ్యాంగ్ రేప్ చోటుచేసుకున్న బూలాగరి గ్రామంలో వేలాది మంది సమాజ్ వాదీ పార్టీ శ్రేణులు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. సెప్టెంబర్ 14న హత్రాస్ జిల్లా బూలాగరి గ్రామంలో 19 ఏళ్ల దళిత బాలికపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడి, తీవ్రంగా గాయపర్చారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఢిల్లీలోని సఫ్తర్ గంజ్ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలు చికిత్స పొందుతూనే మంగళవారం కన్నుమూసింది. అదే రోజు రాత్రి పోలీసులు ఆమె మృతదేహాన్ని బలవంతంగా కాల్చేయడంతో దేశం భగ్గున మండింది. ఘటనపై సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. కాగా,
రాహుల్.. రాజస్థాన్ కు వెళ్లండి..
హత్రాస్ ఘటనపై యూపీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటున్నా, కాంగ్రెస్ పార్టీ కావాలని రాజకీయాలు చేస్తున్నదని రాష్ట్ర మంత్రి సిద్ధార్థ నాథ్ సింగ్ విమర్శించారు. తాజాగా రాజస్థాన్ లో ఇద్దరు మైనర్ బాలికలపై అత్యాచారం జరిగిన ఘటనను ప్రస్తావిస్తూ... రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని, నిజంగా బాధితుల పట్ల కన్సర్న్ ఉంటే రాహుల్, ప్రియాంక గాంధీలు ముందుగా రాజస్థాన్ వెళ్లాలని మంత్రి సిద్ధార్థ ఎద్దేవా చేశారు.