హత్రాస్ : బాధితురాలికి,నిందితుడికి మధ్య 105 ఫోన్ కాల్స్... చార్జిషీట్లో సంచలన విషయాలు...
హత్రాస్ గ్యాంగ్ రేప్ ఘటనకు సంబంధించి ఇటీవలి సీబీఐ చార్జిషీట్లో పేర్కొన్న పలు ఆసక్తికర అంశాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. నలుగురు నిందితుల్లో ఒకరైన నిందితుడు సందీప్కి,బాధితురాలికి మధ్య గతంలో రిలేషన్షిప్ ఉన్నట్లు చార్జిషీట్లో పేర్కొన్నారు. ఇద్దరి విషయం బాధితురాలి ఇంట్లో తెలిసి... సందీప్ కుటుంబంతో వారు గొడవపడటంతో అప్పటినుంచి బాధితురాలు అతనితో మాట్లాడటం మానేసిందని తెలిపారు.దీంతో తీవ్రంగా ఫ్రస్టేట్ అయిన సందీప్ ఆమెపై కక్షతో పాటు అనుమానం కూడా పెంచుకున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఆమెపై హత్యాచారానికి పాల్పడినట్లు తెలిపారు.
ఇద్దరి మధ్య 105 ఫోన్ కాల్స్...
సీబీఐ చార్జిషీట్లో పేర్కొన్న వివరాల ప్రకారం... గతంలో సందీప్కు,బాధితురాలికి మధ్య కొన్నాళ్ల పాటు రిలేషన్షిప్ కొనసాగింది. అక్టోబర్ 17,2019 నుంచి మార్చి 13,2020 వరకూ వీరిద్దరూ 105 సార్లు ఫోన్లో సంభాషించినట్లు సెల్ఫోన్ డేటా ఆధారంగా గుర్తించారు. సందీప్తో గతంలో తామెన్నడూ మాట్లాడలేదని బాధితురాలి కుటుంబం చెప్పినప్పటికీ... బాధితురాలితో సందీప్ వ్యవహారం తెలిశాక ఆ కుటుంబం అతనికి ఇంటికెళ్లి గొడవపడినట్లు ప్రత్యక్ష సాక్షుల కథనంగా పేర్కొన్నారు.
అనుమానం పెంచుకున్న సందీప్...
తమ కుటుంబం సందీప్తో గొడవపడ్డప్పటినుంచి బాధితురాలు అతనితో మాట్లాడటం మానేసింది. ఆ తర్వాత సందీప్ చాలాసార్లు ఆమెతో ఫోన్లో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. తన స్నేహితులు,బంధువుల ఫోన్ల నుంచి ఆమెకు చాలాసార్లు ఫోన్ చేశాడు. అయినప్పటికీ అటువైపు నుంచి ఎటువంటి స్పందన రాలేదు. దీంతో తీవ్రంగా ఫ్రస్టేట్ అయిన సందీప్.. ఆమెపై కక్ష పెంచుకున్నాడు. అంతేకాదు,సోదరి భర్తతో ఆమె సంబంధం పెట్టుకుందేమోనని అనుమానించాడు.
సెప్టెంబర్ 14,2020న
సెప్టెంబర్ 14,2020న ఉదయం 7.30గం. సమయంలో తల్లి,సోదరుడితో కలిసి బాధితురాలు పొలంలో గడ్డి కోసేందుకు వెళ్లింది. మొదట ముగ్గురు కలిసి గడ్డి కోశారు. కాసేపటికి ఆమె సోదరుడు గడ్డి మోపుతో ఇంటికి వెళ్లాడు. మరికాసేపటికి తాను అలసిపోయానని బాధితురాలు తల్లితో చెప్పింది. దీంతో కోయడం ఆపి... కోసిన గడ్డిని ఒకచోట చేర్చమని తల్లి చెప్పింది. తల్లి చెప్పిన మాటతో బాధితురాలు గడ్డిని ఒకచోట కుప్పగా వేసేందుకు వెళ్లింది. ఈ క్రమంలో ఆమె తల్లి బాధితురాలికి 50మీ. దూరంలో గడ్డి కోయడంలో నిమగ్నమవగా... బాధితురాలు హఠాత్తుగా అదృశ్యమైంది.
పోలీసుల నిర్లక్ష్యం...
కాసేపటికి బాధితురాలి తల్లి ఆమె కోసం వెతకగా ఎక్కడా కనిపించలేదు.కొద్దిసేపటికి ఒకచోట ఆమె చెప్పులు కనిపించాయి. ఇంకాస్త ముందుకెళ్లగా కొద్ది దూరంలో పంట పొలంలో బాధితురాలు తీవ్ర గాయాలతో కనిపించింది. దీంతో వెంటనే కుటుంబ సభ్యులకు చెప్పగా... బాధితురాలి సోదరుడు ఆమెను తన భుజాలపై వేసుకుని చంద్పా పోలీస్ స్టేషన్కి వెళ్లాడు. అయితే పోలీసులు మాత్రం మొదట వారిని పట్టించుకోలేదు. కనీసం బాధితురాలిని వైద్య పరీక్షలకు కూడా పంపించలేదు. పోలీసుల నిర్లక్ష్యంతో సకాలంలో బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించకపోవడం వల్ల ఈ కేసులో తీవ్ర నష్టం జరిగిందని చార్జిషీట్లో సీబీఐ పేర్కొంది.
అత్యాచారం,హత్య అభియోగాలు...
సందీప్,రవి,రాము,లవకుష్ అనే నలుగురు అగ్ర కులాలకు చెందిన వ్యక్తులు బాధితురాలిపై అత్యాచారం జరిపి హత్యకు పాల్పడినట్లుగా చార్జిషీట్లో సీబీఐ పేర్కొంది.నిందితులైన సందీప్,రవి,రాము,లవకుష్ అనే నలుగురు యువకులపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చట్టంతో పాటు, సెక్షన్ 376డీ కింద అత్యాచారం,సెక్షన్ 302 కింద హత్య అభియోగాలను మోపింది. ఈ మేరకు స్థానిక కోర్టులో ఇటీవల సీబీఐ చార్జిషీట్ను దాఖలుపరిచింది. కాగా,అత్యాచారానికి గురైన బాధితురాలు ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాధితురాలు సెప్టెంబర్ 29న మరణించిన సంగతి తెలిసిందే.అదే రోజు రాత్రికి రాత్రి కుటుంబ సభ్యులను సైతం అనుమతించకుండా పోలీసులు,స్థానిక అధికారులు మృతురాలికి అంత్యక్రియలు నిర్వహించారు. బాధితురాలితో పాటు ఆమె కుటుంబ సభ్యుల ప్రాథమిక హక్కులను పోలీసులు,అధికారులు కాలరాశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. తల్లిదండ్రులకు కడసారి చూపు కూడా దక్కనివ్వకపోవడంపై దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు వ్యక్తమయ్యాయి. ఈ కేసును యోగి సర్కార్ సీబీఐకి అప్పగించింది. ఘజియాబాద్ బ్రాంచ్కి చెందిన సీబీఐ అధికారులు ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.