హాథ్రస్ కేసు: బాధితురాలిపై రేప్ జరగలేదు, వీర్యకణాలు లేవు: ఫోరెన్సిక్ రిపోర్టు
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హాథ్రస్ ఘటనలో బాధితురాలి మృతికి సంబంధించిన కీలక వివరాలను ఫోరెన్సిక్ నివేదిక వెల్లడించింది. గొంతు నులిమి ఊపిరాడకుండా చేయడం వల్లే బాధితురాలు మృతి చెందినట్లు నివేదిక స్పష్టం చేసింది. అంతేగాక, అత్యాచారం జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలిపింది.
హాథ్రస్ దారుణం: పోస్టుమార్టంలో సంచలన విషయాలు, మెడ ఎముక విరిగి..
బాధితురాలి మెడ భాగంలో తీవ్రగాయాలున్నట్లు నివేదిక వెల్లడించింది. ఢిల్లీ జఫ్తర్ జంగ్ ఆస్పత్రికి చెందిన ముగ్గురు వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. ఆమె మెడ ఎముక విరిగిందని, అక్కడ్నుంచి రక్తస్రావం అయిందని తెలిపారు. బాధితురాలి రహస్య అవయవాల వద్ద గాయాలున్నట్లు తెలిపిన నివేదిక.. ఎలాంటి వీర్య కణాలు ఉన్నట్లు ఆధారాలు లభ్యంకాలేదని నివేదిక వెల్లడించింది.
ఈ నేపథ్యంలో యూపీ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (లాఅండ్ఆర్డర్) ప్రశాంత్ కుమార్ గురువారం మాట్లాడుతూ.. ఫోరెన్సిక్ నివేదిక అత్యాచారం జరగలేదని తేల్చినప్పటికీ.. కొందరు కావాలని కులం పేరుతో ఘర్షణలకు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు.
పోస్టుమార్టం నివేదిక ఏం తేల్చిందంటే..?
ఢిల్లీలోని సప్దర్జంగ్ ఆస్పత్రికి చెందిన ముగ్గురు వైద్యులు హాథ్రస్ బాధితురాలి పోస్టుమార్టం నిర్వహించారు. ఆమె మెడ ఎముక విరిగి ఉందని, అక్కడి నుంచి రక్తస్రావం అయినట్లు తెలిపారు. ఆమెపై అత్యాచారం, గొంతునులిమి హత్య చేసే ప్రయత్నాలు జరిగినట్లు పోస్టుమార్టం రిపోర్టు తేల్చింది.
మెడపై కమిలిన గుర్తులు ఉండటంతో యువతి చున్నీని ఆమె గొంతుకు చుట్టి ఊపిరాడకుండా చేసేందుకు ప్రయత్నించారని తేలింది. దుండుగులు ఆమె గొంతు నులిమే క్రమంలో ఆమె నాలుక తెగి ఉండవచ్చని వైద్యులు భావిస్తున్నారు. ఆమె మెడ ఎముక ప్రాంతంలో చోటు చేసుకున్న గాయం వల్ల అవయవ వైఫల్యం జరిగి, ఆ పరిస్థితి గుండె ఆగిపోవడానికి కారణమై ఉండవచ్చని చెబుతున్నారు.