హాథ్రస్ దారుణం: పోస్టుమార్టంలో సంచలన విషయాలు, మెడ ఎముక విరిగి..
లక్నో: దేశ వ్యాప్తంగా కలకలం రేపిన హాథ్రస్ ఘటనలో బాధితురాలి పోస్టుమార్టం రిపోర్టులో దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడయ్యాయి. బాధితురాలి గొంతునులిమి ఊపిరాడకుండా చేసి హతమార్చినట్లు తేలింది. అంతేగాక, ఆమె మెడ ప్రాంతంలో తీవ్రగాయాలున్నాయి. ఎముకలు కూడా విరిగినట్లే తేల్చింది.
మెడ ఎముక విరిగి..
ఢిల్లీలోని సప్దర్జంగ్ ఆస్పత్రికి చెందిన ముగ్గురు వైద్యులు హాథ్రస్ బాధితురాలి పోస్టుమార్టం నిర్వహించారు. ఆమె మెడ ఎముక విరిగి ఉందని, అక్కడి నుంచి రక్తస్రావం అయినట్లు తెలిపారు. ఆమెపై అత్యాచారం, గొంతునులిమి హత్య చేసే ప్రయత్నాలు జరిగినట్లు పోస్టుమార్టం రిపోర్టు తేల్చింది.
అలా నాలుక తెగి ఉంటుంది..
మెడపై కమిలిన గుర్తులు ఉండటంతో యువతి చున్నీని ఆమె గొంతుకు చుట్టి ఊపిరాడకుండా చేసేందుకు ప్రయత్నించారని తేలింది. దుండుగులు ఆమె గొంతు నులిమే క్రమంలో ఆమె నాలుక తెగి ఉండవచ్చని వైద్యులు భావిస్తున్నారు. ఆమె మెడ ఎముక ప్రాంతంలో చోటు చేసుకున్న గాయం వల్ల అవయవ వైఫల్యం జరిగి, ఆ పరిస్థితి గుండె ఆగిపోవడానికి కారణమై ఉండవచ్చని చెబుతున్నారు.
నివేదిక యూపీ పోలీసులకు..
అయితే, యువతి జీర్ణాయ స్రావాల విశ్లేషణకు సంబంధించిన నివేదిక అందిన తర్వాత కానీ, ఖచ్చితమైన కారణాన్ని నిర్ణయించలేమని వైద్యులు తెలిపారు. ఈ పోస్టుమార్టం రిపోర్టును ఉత్తరప్రదేశ్ పోలీసులకు అందజేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హాథ్రస్లో నలుగురు దుండగులు బాధిత యువతిపై దారుణంగా దాడి చేసి ఆమెను హతమార్చిన విషయం తెలిసిందే.
Recommended Video
క్రూర మృగాళ్ల దాడిలో..
ఆ క్రూర మృగాల దాడిలో ఆమె తీవ్రంగా గాయపడింది. నగ్నంగా, రక్తపు మడుగులో ఉన్న ఆమెను మొదట అలీఘడ్లోని జవహర్లాల్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్కి, ఆ తర్వాత ఢిల్లీలోని సప్దర్ జంగ్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే తీవ్రంగా గాయపడిన బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. ఈ ఘటనపై కాంగ్రెస్ సహా విపక్షాలు భారీ ఎత్తున నిరసనలు చేపట్టాయి. కాగా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ బాధితురాలి కుటుంబంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని హామి ఇచ్చారు. బాధితురాలి కుటుంబానికి రూ. 25 లక్షల సాయంతోపాటు, ఆమె కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పిస్తామని హామి ఆచ్చారు.