అది ఎవరి మృతదేహం..మా బిడ్డది కాదు: హాథ్రస్ ఘటన మృతురాలి కుటుంబ సభ్యులు సంచలన వ్యాఖ్యలు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాథ్రస్ అత్యాచార ఘటనలో మీడియా పై ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో పలు అనుమానాలు రేకెత్తాయి. మృతురాలి గ్రామంలో ఆమె ఇంటి వద్ద పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఇక మృతురాలి కుటుంబ సభ్యులను కలవకుండా మీడియాను పోలీసులు అడ్డుకున్నారు. తాజాగా ఆ బారికేడ్లను పోలీసులు తొలగించారు. వారిపై ఒత్తిడి వస్తుండటంతో కుటుంబ సభ్యులను మీడియా ప్రతినిధులు కలిసేందుకు అనుమతించారు.
నిందితులకు అనుకూలంగా సిట్
ఈ క్రమంలోనే మీడియా మృతురాలి కుటుంబ సభ్యులను కలిసింది. ఈ సందర్భంగా వారి బాధను మీడియాతో పంచుకున్నారు. ఈ ఘటనపై సీబీఐ విచారణ చేసినప్పటికీ తమకు న్యాయం జరగదని సుప్రీం కోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. విచారణ చేస్తున్న సిట్ నిందితులకు అనుకూలంగా వ్యవహరిస్తోందన్న అనుమానంను కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తూనే తమకు సీబీఐ విచారణ పై కూడా నమ్మకం లేదని సీబీఐతో విచారణ అక్కర్లేదని తేల్చి చెప్పారు. అంతేకాదు తాము లేకుండా తమ కూతురి మృతదేహాన్ని ఎలా దహనం చేస్తారని అలా చేయొద్దని పోలీసులను బతిమిలాడినా ప్రయోజనం లేకపోయిందని చెబుతూ తల్లి కన్నీటి పర్యంతమైంది.
నార్కో టెస్టులు ముందుగా కలెక్టర్కు,ఎస్పీకి చేయాలి
నార్కో టెస్టులు అంటే ఏమిటో తమకు తెలియదని మృతురాలి తల్లి చెప్పింది. అయితే ఆ నలుగురు నిందితులే తమ కూతురి ప్రాణాలను అన్యాయంగా తీశారని ఇప్పటికీ ఆ వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నామని బాధితురాలి తల్లి చెప్పింది. ఇదిలా ఉంటే.. అబద్దాలు తాము చెప్పడం లేదని ముందుగా కలెక్టర్, మరియు ఎస్పీలకు నార్కో టెస్టులు నిర్వహించాలని డిమాండ్ చేసింది మృతురాలి బంధువు. ఆ ఇద్దరే అబద్ధాలు చెబుతున్నారని వారికి ముందుగా నార్కోటెస్టులు నిర్వహించాలని చెప్పారు. ఇప్పటి వరకు తాము ఏ రాజకీయ నాయకుడితో ఫోన్లో మాట్లాడలేదని వెల్లడించారు. ఏదో మంచి చేద్దామన్న ఆలోచనతో రాజకీయ నాయకులు ఇక్కడకు రావడం లేదని వారి రాజకీయ లబ్ధి కోసమే తమ గ్రామంకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
Recommended Video
సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణకు డిమాండ్
ఇదిలా ఉంటే ఘటనపై సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ ఊపందుకుంటుండటంతో మృతురాలి తల్లి మాత్రం తమకు సీబీఐతో విచారణ అక్కర్లేదని తేల్చి చెప్పింది. ఇక ఘటనపై సిట్ విచారణ జరుపుతుందని ప్రభుత్వం ఓ వైపు చెబుతోందని అయితే ఇప్పటి వరకు సిట్ అధికారులు ఎవరూ వచ్చి విచారణ చేసింది లేదని చెప్పారు. ఇదిలా ఉంటే బాధితురాలి మృతదేహంను దహనం చేయలేదని.. దాన్ని పోలీసులు ఎక్కడో దాచి ఉంచారని సంచలన వ్యాఖ్యలు చేసింది మృతురాలి వదిన. పోలీసులు ఎవరి మృతదేహం తీసుకొచ్చి దహనం చేశారో స్పష్టత ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు.