హత్రాస్ కేసు : ఆగ్రాలో రాళ్ల దాడి... వాల్మీకి కమ్యూనిటీ వర్సెస్ పోలీసులు...
హత్రాస్ గ్యాంగ్ రేప్ ఘటనను నిరసిస్తూ శనివారం(అక్టోబర్ 2) ఆగ్రా,ఫిరోజాబాద్ ప్రాంతాల్లో వాల్మీకి కుల సంఘాలు రోడ్డెక్కాయి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వీధుల్లో నిరసనకు దిగాయి. ఈ క్రమంలో ఆగ్రాలోని లోహ మండి ప్రాంతంలో ఉన్న రాజ్నగర్ వద్ద నిరసనకారులు గుమిగూడగా... యాంటీ రాయిట్ ఫోర్స్ వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నించింది.
పోలీసులు తమవైపు రావడం గుర్తించిన నిరసనకారులు రాళ్లు రువ్వడం మొదలుపెట్టారు. దీంతో పోలీసులు కూడా వారి పైకి రాళ్లు విసిరారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. రాళ్ల దాడిలో పలువురు గాయపడ్డారు. దీనికి సంబంధించి పలువురిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఆగ్రాలోని మరికొన్ని చోట్ల కూడా వాల్మీకి సంఘాలు నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. అటు ఫిరోజాబాద్లోనూ యువ వాల్మీకి ఫోర్స్ ప్రెసిడెంట్ అనురాగ్ చౌహాన్ ఆధ్వర్యంలో వాల్మీకి కమ్యూనిటీ నిరసన ప్రదర్శన చేపట్టింది. నగర నిగం నుంచి సుభాష్ క్రాసింగ్ వరకు ర్యాలీ నిర్వహించి ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ దిష్టిబొమ్మను దగ్దం చేశారు. ఈ క్రమంలో పోలీసులు అడ్డుపడటంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం,ఘర్షణ చోటు చేసుకుంది. ఓ యువకుడు తన చొక్కాకు నిప్పంటించుకోవడంతో ఉద్రిక్తత పెరిగింది. అనురాగ్ చౌహాన్ కూడా కళ్లు తిరిగి పడిపోవడంతో ఆయన్ను స్థానిక మెడికల్ కాలేజీకి తరలించారు.
Recommended Video
హత్రాస్ గ్యాంగ్ రేప్ ఘటనను అధికారులు ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నారని... బాధితురాలి కుటుంబాన్ని బెదిరించిన జిల్లా మెజిస్ట్రేట్పై ఇప్పటివరకూ చర్యలు తీసుకోలేదని వాల్మీకి కమ్యూనిటీ ఆరోపించింది. మెజిస్ట్రేట్పై చర్యలు తీసుకునేంతవరకూ పారిశుద్ధ్య పనులకు హాజరయ్యేది లేదని... తమ నిరసనలు కొనసాగిస్తామని స్పష్టం చేసింది. మరోవైపు హత్రాస్ గ్యాంగ్ రేప్ కేసును యూపీ సర్కార్ సీబీఐకి అప్పగించిన సంగతి తెలిసిందే.