హాథ్రస్ ఘటన: నిందితులకు మద్దతుగా అగ్రకులాల వారు..పంచాయతీ పెట్టి మరీ..!
హాథ్రస్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాథ్రస్ అత్యాచార ఘటనలో మరో ట్విస్టు చోటుచేసుకుంది. దేశం మొత్తం నిందితులను ఉరితీయాలని బాధితురాలి కుటుంబానికి న్యాయంచేయాలనే నినాదాలు మిన్నంటుతుండగా... కొందరు అగ్రకులాల వారు మాత్రం నిందితులకు అండగా నిలుస్తున్నారు. నిందితులకు అండగా నిలిచిన ఈ అగ్రకులాల వారిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
శిక్ష భవిష్యత్ తరాలకు గుర్తుండిపోయేలా..: హాథ్రస్ ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రతిజ్ఞ
నిందితులకు మద్దతుగా..
ఉత్తర్ ప్రదేశ్ హాథ్రస్లో ఓ దళిత యువతిపై అత్యాచారం చేయడంతో ఆ యువతి చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన పై దేశం మరోసారి ఏకమైంది. నిందితులను కఠినంగా శిక్షించాలని ఓ వైపు దేశం డిమాండ్ చేస్తుండగా కొందరు అగ్రకులాల వారు మాత్రం నిందితులకు మద్దతుగా నిలుస్తూ ధర్నా చేశారు. వారికి న్యాయం జరగాలని సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేయడం విడ్డూరంగా మారింది. ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసి పారదర్శకమైన విచారణ చేయాలని డిమాండ్ చేశారు. అత్యాచారం కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు నిజంగానే తప్పు చేసి ఉంటే శిక్షించాలని అదే సమయంలో తప్పు చేసిన వారిని వదల కూడదని చెబుతున్నారు.
విచారణ పారదర్శకంగా జరగాలన్న అగ్రకులాలు
భాగ్నా గ్రామంలో నిందితుల తరపున మద్దతుగా నిలిచిన కొందరు అగ్రకులాల వారు పంచాయతీని ఏర్పాటు చేశారు. అత్యాచార బాధితుల గ్రామానికి ఈ గ్రామం 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక ఈ పంచాయితీకి హాజరైన వారంతా ఆశ్చర్యకరంగా నిందితులకు మద్దతుగా మాట్లాడటం చర్చనీయాంశమైంది. చాలామంది రాజకీయంగా లబ్ధి పొందేందుకు ఈ ఘటనను పావుగా వినియోగించుకుంటున్నారని మండిపడ్డారు. అంతేకాదు మృతురాలి తల్లిని, సోదరుడిని పారదర్శకంగా విచారణ చేస్తే అసలు వాస్తవాలు బయటకు వస్తాయని వారు చెబుతున్నారు. ఈ నలుగురు యువకులు నీళ్లు ఇస్తున్న క్రమంలో వారిని మృతురాలితో పాటు ఆమె తల్లి, సోదరుడు తిట్టారని ఓ వ్యక్తి చెప్పాడు. ఇదిలా ఉంటే ఈ అత్యాచార ఘటనపై పోలీసుల సరైన విచారణ చేస్తున్నారని అయితే కొందరు ఈ ఘటనను రాజకీయం చేసే యోచన చేస్తున్నారని మండిపడ్డాడు. ఘటనపై సీబీఐతో ఎంక్వైరీ చేయించాలని డిమాండ్ చేశారు.
Recommended Video
ఘటనపై ఎన్నో అనుమానాలు...
హాథ్రస్ అత్యాచారం ఘటన వెనక పెద్ద తలకాయాలు ఉన్నాయా అనే అనుమానం వ్యక్తమవుతోంది. నిందితులు అగ్రకులాలు వారు కావడంతో వారిని కాపాడే ప్రయత్నం జరుగుతోందంటూ జాతీయ మీడియా కథనాలను ప్రసారం చేసింది. ఇక ఘటనపై తమ వాదన వినిపించేందుకు మృతురాలి కుటుంబ సభ్యులకు అవకాశం లేకుండా చేయడం, వారిపై ఆంక్షలు విధించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇదిలా ఉంటే హాథ్రస్ గ్రామంలోకి మీడియాను అనుమతించకపోవడంపై కూడా ఎన్నో అనుమానాలను రేకెత్తిస్తోంది. మరోవైపు ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వాల్మికీ సామాజిక వర్గంవారు 19 ఏళ్ల యువతికి న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నారు. ఇదిలా ఉంటే ఫోరెన్సిక్ నివేదిక ప్రకారం యువతిపై అత్యాచారం జరగలేదని చెప్పి అగ్నికి ఆజ్యం పోశారు ఉత్తర్ ప్రదేశ్ లా అండ్ ఆర్డర్ ఏడీజీ ప్రశాంత్ కుమార్. అంతకుముందు యువతి వెన్నుకు గాయం, గొంతును నులిమిన గుర్తులు ఉన్నట్లు పోస్టుమార్టం నివేదిక పేర్కొంది.