హత్రాస్ గ్యాంగ్రేప్: సీబీఐ విచారణలో కొత్త కోణాలు: మృతురాలి సోదరులకు సమన్లు..మళ్లీ విచారణ
లక్నో: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఉత్తర ప్రదేశ్లోని హత్రాస్లో 19 సంవత్సరాల దళిత యువతిపై చోటు చేసుకున్న అత్యాచారం ఘటనలో కొత్త కోణాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అత్యాచార బాధితురాలు మరణించడంతో ఈ కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఉత్తర ప్రదేశ్లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం విచారణను సీబీఐకి బదలాయించిన అనంతరం.. మళ్లీ మొదటి నుంచి దర్యాప్తు సాగుతంది. సీబీఐ అధికారులు ప్రతి అంశాన్నీ క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. ప్రతి కోణంలోనూ లోతుగా దర్యాప్తు సాగిస్తున్నారు.
వర్షాల వల్ల పంట నష్టాన్ని అంచనా వేసిన పవన్ కల్యాణ్: ఇళ్లల్లోనే ఉండండి..బయటికి రావొద్దంటూ
ఇందులో భాగంగా.. మృతురాలి కుటుంబీకులకు మరోసారి సమన్లను జారీ చేశారు. ఆమె ముగ్గురు సోదరులను విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశాలను జారీ చేశారు. ఇదివరకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణను వారు ఎదుర్కొన్నారు. తాజాగా- మరోసారి సీబీఐ అధికారుల సమక్షానికి మృతురాలి ముగ్గురు సోదరులు హాజరు కావాల్సి ఉంది. విచారణ సందర్భంగా వారు వెల్లడించే అంశాలే ఈ కేసులో కీలకంగా మారబోతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
తమ దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు మంళవారమే మృతురాలి స్వగ్రామం బుల్గధీలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక పోలీసులు వారికి కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు. కనీసం కుటుంబ సభ్యలకు కూడా రానివ్వకుండా మృతదేహాన్ని తగులబెట్టిన ఉదంతం తరువాత స్థానికులు పోలీసులపై భగ్గుమంటున్నారు. వారిని తరచూ అడ్డుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య సీబీఐ అధికారులు మృతురాలి గ్రామంలో పర్యటించడాన్ని దృష్టిలో ఉంచుకుని వారికి భద్రతను కల్పించారు. అనంతరం అత్యాచారం చోటు చేసుకున్న ప్రదేశాన్ని, పోలీసులు మృతదేహాన్ని దహనం చేసిన ప్రాంతాన్నీ సీబీఐ అధికారులు పరిశీలించారు.
Recommended Video
కొన్ని కీలక ఆధారాలను సేకరించినట్లు చెబుతున్నారు. హత్రాస్లో దళిత యువతి మీద అదే ప్రాంతానికి చెందిన నలుగురు యువకులు అత్యంత పాశవికంగా అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. కిందటినెల 15వ తేదీన ఈ ఘటన చోటు చేసుకోగా..బాధితురాలు 14 రోజుల తరువాత దేశ రాజధాని సఫ్దర్జంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ ఘటన అనంతరం ఉత్తర ప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇదే కేసులో మృతురాలి ముగ్గురు సోదరులను పోలీసులు మరోసారి విచారణకు హాజరు కావాలని ఆదేశించడం చర్చనీయాంశమౌతోంది.