హత్రాస్ గ్యాంగ్ రేప్ నిందితులను ఎన్కౌంటర్ చేయబోతున్నారా... ఆ వ్యాఖ్యలతో హింట్...?
హత్రాస్ గ్యాంగ్ రేప్ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతున్న తరుణంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్ వర్గియా సంచలన వ్యాఖ్యలు చేశారు. కారు ఎప్పుడైనా బోల్తా కొట్టే ఛాన్స్ ఉందని... పరోక్షంగా ఎన్కౌంటర్ హింట్ ఇచ్చారు. దీంతో దిశా ఘటన తరహాలోనే యూపీలో హత్రాస్ గ్యాంగ్ రేప్ నిందితులను కూడా యోగి సర్కార్ ఎన్కౌంటర్ చేయబోతుందా అన్న చర్చ జరుగుతోంది. బాధితురాలిని తీవ్రంగా హింసించి సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితులకు ఎన్కౌంటరే సరైన శిక్ష అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అమ్మకు ఏడవద్దని చెప్పండి... త్వరలోనే ఇంటికొచ్చేస్తా... ఆస్పత్రిలో హత్రాస్ బాధితురాలి మాటలు...
కైలాష్ విజయ్వర్గియా ఏమన్నారు...
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్వర్గియా మాట్లాడుతూ... 'నిందితులను అరెస్ట్ చేశారు... కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పగించారు... నిందితుల్ని జైలుకు పంపిస్తారు... అక్కడున్నది సీఎం యోగి ఆదిత్యానాథ్... ఆయన రాష్ట్రంలో బండి(కారు) ఎప్పుడైనా బోల్తా కొట్టగలదు...' అంటూ కైలాష్ వ్యాఖ్యానించారు. బండి బోల్తా కొట్టవచ్చునని ఆయన చేసిన వ్యాఖ్యలు ఎన్కౌంటర్కు పరోక్ష హింట్ అని చాలామంది భావిస్తున్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
దూబే ఎన్కౌంటర్ సమయంలో కారు బోల్తా....
ఈ ఏడాది జులైలో కాన్పూర్ గ్యాంగ్ స్టర్ వికాస్ దూబేను యూపీ పోలీసులు ఎన్కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో దూబే అరెస్ట్ అనంతరం అతన్ని కాన్పూర్కు తరలిస్తుండగా... మార్గమధ్యలో ఓచోట కారు బోల్తా కొట్టింది. అదే అదనుగా వికాస్ దూబే ఓ పోలీస్ అధికారి గన్ లాక్కుని అక్కడి నుంచి పరారయ్యేందుకు యత్నించాడు. ఈ క్రమంలోనే పోలీసులు అతనిపై కాల్పులు జరపడంతో ఎన్కౌంటర్లో మృతి చెందాడు. అయితే దూబేని తరలిస్తున్నప్పుడు కారు బోల్తా కొట్టిందని పోలీసులు చెప్పిన కథనంపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఎన్కౌంటర్ కోసమే కట్టు కథ అల్లారన్న విమర్శలు వినిపించాయి. తాజాగా కైలాష్ విజయ్వర్గియా కారు ఎప్పుడైనా బోల్తా కొట్టవచ్చునని చేసిన వ్యాఖ్యలు దూబేని ఎన్కౌంటర్ను గుర్తుకు తెస్తున్నాయి.
Recommended Video
దిశా తరహాలో సత్వర న్యాయం కోసం...
గత ఏడాది హైదరాబాద్ సమీపంలోని షాద్ నగర్ టోల్ ప్లాజా సమీపంలో జరిగిన దిశ హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా సత్వర న్యాయం కోసం నిరసనలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. అప్పటి ప్రజాగ్రహంతో పోలీసులు నిందితులను ఎన్కౌంటర్ చేశారు. నవంబర్ 27 రాత్రి దిశ హత్యాచార ఘటన జరగ్గా... డిసెంబర్ 6న తెల్లవారుజామున 3 గంటలకు ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్తో తెలంగాణ పోలీసులపై ప్రశంసలు కురిశాయి. అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దిశ చట్టాన్ని కూడా తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో తాజా అత్యాచార ఘటనలోనూ సత్వర న్యాయం కావాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది.