నేనూ కుల వివక్ష బాధితుడినే... నటుడు నవాజుద్దిన్ సిద్దిఖీ సంచలన వ్యాఖ్యలు...
తానూ కుల వివక్ష బాధితుడినేనని అంటున్నారు బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ. తాను సినిమాల్లో స్టార్ అయినా కులం కారణంగా తన గ్రామంలో ఇప్పటికీ చిన్న చూపే చూస్తారని చెబుతున్నాడు. 'మా కుటుంబంలో మా నానమ్మ ఒక దిగువ కులానికి చెందిన మహిళ. ఆ కారణంగా ఇప్పటికీ మా గ్రామస్తులు మమ్మల్ని చిన్న చూపే చూస్తారు. మమ్మల్ని వాళ్లు ఎప్పటికీ ఒప్పుకోరు..' అని ఓ ప్రముఖ టీవీ ఛానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నవాజుద్దీన్ వెల్లడించాడు. ఇటీవల హత్రాస్ గ్యాంగ్ రేప్ ఘటన నేపథ్యంలో దేశంలో కుల వివక్షపై మరోసారి తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో నవాజుద్దీన్ దీనిపై స్పందించారు.
కులం లేదని మాట్లాడవచ్చు... కానీ..
'సినిమాల్లో నాకు చాలా గుర్తింపు ఉండవచ్చు. కానీ అదేదీ వాళ్లకు అవసరం లేదు. కులం వాళ్లలో నరనరాన బలంగా నాటుకుపోయింది. కులమే తమకు గర్వ కారణమని భావిస్తుంటారు. అక్కడ షేక్ సిద్దిఖీలు అగ్ర కులాలు. తమకంటే తక్కువ అని భావించే కులాలతో వాళ్లు ఎటువంటి సంబంధాలు పెట్టుకోరు. ఇప్పటికీ వాళ్లది అదే ధోరణి..' అని నవాజుద్దీన్ సిద్దిఖీ పేర్కొన్నారు. ఇటీవలి హత్రాస్ గ్యాంగ్ రేప్ ఘటనను దురదృష్టకర సంఘటన అని పేర్కొనడాన్ని సిద్దిఖీ తీవ్రంగా ఖండించారు.ఏది తప్పో దానికి వ్యతిరేకంగా మాట్లాడాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పిన సిద్దిఖీ... సినీలోకం కూడా హత్రాస్ ఘటనపై స్పందిస్తోందన్నారు. కొంతమంది అసలు కుల వివక్ష లేదని మాట్లాడవచ్చు... కానీ ఒకసారి క్షేత్ర స్థాయిలో తిరిగి చూస్తే రియాలిటీ ఏంటో తెలిసి వస్తుందన్నారు.
అట్రాసిటీలపై ఓ సామాజిక కార్యకర్త...
శీతల్ కాంబ్లే అనే ఓ సామాజిక కార్యకర్త అట్రాసిటీ కేసులపై మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. '2014 నుంచి దళిత మహిళలపై అట్రాసిటీలకు సంబంధించి 9 కేసులు నేను డీల్ చేశాను. అన్నింటిలోనూ ఒకే తరహా సీన్ కనిపిస్తుంది. చివరలో ఆ కేసులను భూ వివాదంగా మలిచి కుల కోణాన్ని తప్పిస్తారు.బాధితురాలి మానసిక స్థితిని,ఆమె వ్యక్తిత్వాన్ని చెడుగా చూపేందుకు ప్రయత్నిస్తారు. ఇంకో ముఖ్య విషయమేంటంటే... గ్రామం మొత్తానికి వారికి శత్రువులుగా తయారుచేస్తారు. తద్వారా నిజ నిర్దారణ కమిటీలకు,సామాజిక కార్యకర్తలకు అక్కడి వాళ్లెవరూ సహకరించరు..' అని చెప్పుకొచ్చారు.
హత్రాస్ ఘటనతో కుల వివక్షపై చర్చ...
ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో సెప్టెంబర్ 14న ఓ దళిత యువతిపై నలుగురు అగ్ర కులాలకు చెందిన వ్యక్తులు గ్యాంగ్ రేప్కు పాల్పడిన సంగతి తెలిసిందే. ఆమె నాలుక కోసి,విచక్షణారహితంగా దాడి చేయడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సెప్టెంబర్ 25న ఆమె మృతి చెందింది. అయితే ఈ కేసులో నిందితులు అగ్ర కులాలకు చెందినవారు కావడంతోనే పోలీసులు మొదట నిర్లక్ష్యం వహించారన్న ఆరోపణలున్నాయి. పైగా బాధితురాలు మృతి చెందిన రోజు రాత్రికి రాత్రే కుటుంబ సభ్యులను సైతం అనుమతించకుండా ఆమె మృతదేహానికి పోలీసులు,అధికారులే దహన సంస్కారాలు నిర్వహించడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. బాలిక సామాజిక,ఆర్థిక నేపథ్యాన్ని అలుసుగా తీసుకుని అంత్యక్రియలు నిర్వహించకుండా ఆమె ప్రాథమిక హక్కును సైతం కాలరాశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై అలహాబాద్ కోర్టు సైతం సుమోటో కేసు నమోదు చేసింది. ఈ ఘటన నేపథ్యంలో దేశంలో కుల వివక్షపై చర్చ మరోసారి తెర పైకి వచ్చింది. ఈ క్రమంలోనే నవాజుద్దీన్ సిద్దిఖీ కూడా కులంపై స్పందించారు.