హాత్రస్ హత్యాచారం: సిట్ దర్యాప్తుపై ప్రియాంక ఆగ్రహం - కలెక్టర్ను ఉపేక్షించడంపై పోలీసుల అసహనం
ఉత్తరప్రదేశ్ లోని హాత్రస్ జిల్లాలో 19 ఏళ్ల దళిత యువతిపై అదే గ్రామానికి చెందిన అగ్రకులం యువకులు హత్యాచారానికి పాల్పడిన ఘటనపై దర్యాప్తు జరుగుతోన్న తీరును బాధిత కుటుంబీకులు, విపక్షాలు తప్పు పట్టాయి. హాత్రస్ కేసును సీబీఐకి అప్పగిస్తామన్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటనకు విరుద్ధంగా యూపీ పోలీసుల నేతృత్వంలోని సిట్ బృందం ఆదివారం బాధిత కుటుంబీకుల వాగ్మూలాన్ని నమోదు చేయడం కలకలం రేపింది.
సబ్బం హరి ఇంటికెళ్లి నాలుక కోస్తాం - వైసీపీ ఎమ్మెల్యే స్ట్రాంగ్ వార్నింగ్ - పొలిటికల్ బ్రోకర్ అంటూ..
సీబీఐకి ఇచ్చాక.. సిట్ ఎందుకు?
పలు ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులతో కూడిన సిట్ బృందం.. ఆదివారం బుల్ గడీ గ్రామంలో పర్యటించి, బాధిత కుటుంబీకుల వాగ్మూలాన్ని రికార్డు చేసుకుంది. ఇన్ చార్జి ఎస్పీ వినీత్ జైస్వాల్ బాధితురాలిపై సామూహిక లైంగిక దాడి జరిగిన ప్రాంతాన్ని సందర్శించారు. బాధితురాలి తండ్రి ఆరోగ్యం క్షీణించడంతో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఈ కేసును సీబీఐకి అప్పగించిన తర్వాత మళ్లీ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని సిట్ దర్యాప్తు చేయడమేంటని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ, ఇతర విపక్ష నేతలు ప్రశ్నించారు. నిందితుల జోలికి పోకుండా, బాధిత కుటుంబాన్ని పోలీసులు వేధిస్తున్నదని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మండిపడ్డారు.
డీఎంపై వేటుకు డిమాండ్..
హాత్రస్ ఘటనలో ఆ జిల్లా కలెక్టర్(డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్) తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. యువతి మృతదేహాన్ని బలవంతంగా కాల్చేయడం, బాధిత కుటుంబాన్ని బెదిరించడం లాంటి చర్యలకు పాల్పడిన ఆయనను వెంటనే విధుల నుంచి తొలగించాలని ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు. శనివారం హాత్రాస్ బాధిత కుటుంబంతో మాట్లాడిన ఆమె.. బాధితులు తన ముందుంచిన డిమాండ్లు ఇవేనంటూ ఆదివారం కీలక విషయాలను వెల్లడించారు.
ఘటనపై సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో జ్యూడీషియల్ విచారణ జరగాలని, హాత్రస్ డీఎం ప్రవీణ్ కుమార్ లక్స్ కర్ ను వెంటనే తొలగించి, ఆయనకు మరో పోస్టు ఇవ్వరాదని బాధిత కుటుంబం డిమాండ్ చేసినట్లు ప్రియాంక తెలిపారు. అధికారులందరూ తమను తప్పుదోవ పట్టించిన క్రమంలో అసలు కాల్చేసింది తమ కూతురినేనా? అనే అనుమానాలనూ బాధిత కుటుంబం వ్యక్తపరిచిందని ప్రియాంక పేర్కొన్నారు.
రెండో భార్యగా స్వీకరించాడు: బీజేపీ మహిళా కార్యకర్త సంచలనం - రాసలీలల్లో ఇంకొందరు నేతలంటూ
Recommended Video
ఐపీఎస్ అసోసియేషన్ అసహనం..
హాత్రస్ ఘటనలో జిల్లా ఎస్పీ విక్రాంత్ వీర్ పై స్పెన్షన్ వేటువేసిన యోగి ప్రభుత్వం.. వివాదానికి అసలు కారకుడైన కలెక్టర్(డీఎం) ప్రవీణ్ కుమార్ లక్స్ కర్ ను మాత్రం ఉపేక్షించడంపై ఐపీఎస్ అధికారుల అసోసియేషన్ అసహనం వ్యక్తం చేసింది. డీఎం ఆదేశాలను మాత్రమే పోలీసులు అమలు చేశారని, అలాంటిది పోలీసులపై చర్యలు తీసుకుని, డీఎంను వదిలేయడం సబబుగా లేదని అసోసియేషన్ అభిప్రాయపడింది. బీఎస్పీ అధినేత్రి మాయావతి సైతం డీఎంపై చర్యలు తీసుకోకపోవడాన్ని తప్పుపట్టారు.