యువతి గ్యాంగ్రేప్..మృతిపై రాజకీయ వేడి: ప్రతిపక్షాలు భగ్గు: ప్రభుత్వానిదే బాధ్యత: ప్రియాంకా గాంధీ
లక్నో: ఉత్తర ప్రదేశ్లోని హత్రాస్లో నలుగురు కామాంధుల చేతుల్లో సామూహిక అత్యాచారానికి గురైన 19 సంవత్సరాల దళిత యువతి మరణించిన ఉదంతం.. రాజకీయ వేడినీ రగిల్చింది. ఇప్పటికే పలు ప్రజా, మహిళా సంఘాలు ఈ దారుణ ఉదంతం పట్ల భగ్గుమంటున్నాయి. తాజాగా- రాజకీయ పార్టీలు, ప్రతిపక్ష నేతలూ వారితో జత కలిశారు.. గళం కలిపారు. హత్రాస్ గ్యాంగ్రేప్ ఘటన యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని మండిపడుతున్నారు.
బాధిత యువతి మరణించడంపై అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఈ ఘటన నిలువెత్తు నిదర్శనంగా మారిందని మండిపడ్డారు. ఈ నెల 14వ తేదీన ఆ యువతి గ్యాంగ్రేప్ గురికాగా.. కనీసం పోలీసులు కేసును కూడా నమోదు చేయలేని దయనీయ స్థితిలో ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. ప్రభుత్వం అగ్రవర్ణాలకు ఒకరకంగా.. దళిత, గిరిజనుల పట్ల మరో రకంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.
అగ్రవర్ణాలపై కేసు పెట్టడానికి ప్రభుత్వం ఏ మాత్రమూ అంగీకరించట్లేదనే విషయం.. హత్రాస్ ఉదంతంతో మరోసారి స్పష్టమైందని ప్రియాంకా గాంధీ ఆరోపించారు. ఈ మేరకు ఆమె ఓ ట్వీట్ చేశారు. అత్యాచారం జరిగిన తరువాత రెండువారాల పాటు ఆమె మృత్యువుతో పోరాడారని, నాణ్యమైన వైద్యాన్ని సైతం ప్రభుత్వం కల్పించలేకపోయిందని ధ్వజమెత్తారు. దేశరాజధానిలోని సఫ్దర్గంజ్ ఆసుపత్రిలో బాధితురాలు మరణించిందనే విషయాన్ని తాను యోగి ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నానని చెప్పారు.
हाथरस में हैवानियत झेलने वाली दलित बच्ची ने सफदरजंग अस्पताल में दम तोड़ दिया। दो हफ्ते तक वह अस्पतालों में जिंदगी और मौत से जूझती रही।
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) September 29, 2020
हाथरस, शाहजहांपुर और गोरखपुर में एक के बाद एक रेप की घटनाओं ने राज्य को हिला दिया है। ..1/2
హత్రాస్, షాజహాన్పూర్, గోరఖ్పూర్లల్లో వరుసగా చోటు చేసుకుంటోన్న అత్యాచార ఘటనలు రాష్ట్రాన్ని కుదిపేస్తున్నాయని, అయినప్పటికీ ప్రభుత్వం వాటికి అడ్డుకట్ట వేయడానికి తీసుకున్న చర్యలు శూన్యమని ప్రియాంకా గాంధీ వాద్రా విమర్శించారు. ఉత్తర ప్రదేశ్లో శాంతిభద్రతలు క్షీణించిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందనే విషయం మరోసారి తేటతెల్లమైందని, నేరగాళ్లు బహిరంగంగా దారుణాలకు ఒడిగడుతున్నారని చెప్పారు. హత్రాస్లో దళిత యువతిపై అత్యాచారానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రియాంకా గాంధీ డిమాండ్ చేశారు.
हाथरस में हैवानियत झेलने वाली दलित बच्ची ने सफदरजंग अस्पताल में दम तोड़ दिया। दो हफ्ते तक वह अस्पतालों में जिंदगी और मौत से जूझती रही।
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) September 29, 2020
हाथरस, शाहजहांपुर और गोरखपुर में एक के बाद एक रेप की घटनाओं ने राज्य को हिला दिया है। ..1/2
హత్రస్కు చెందిన 19 సంవత్సరాల దళిత యువతి నలుగురు కామాంధుల చేతిలో సామూహిక అత్యాచారానికి గురైన విషయం తెలిసిందే. ఈ నెల 14వ తేదీన ఈ ఘటన చోటు చేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తల్లి, సోదరుడితో కలిసి పొలం పనుల కోసం వెళ్లిన బాధితురాలపై హత్రాస్కే చెందిన నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ సమయంలో బాధితురాలు తీవ్రంగా ప్రతిఘటించడంతో ఆ నలుగురూ విచక్షణారహితంగా ఆమెపై దాడికి పాల్పడ్డారు. ఇష్టానుసారంగా కొట్టారు. చిత్రవధకు గురి చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె ఈ ఉదయం మరణించారు.