హాథ్రస్ కేసులో మరో ట్విస్ట్: నక్సల్స్ ప్రమేయం - హైకోర్టుకు బాధిత కుటుంబం - సీబీఐ ఎఫ్ఐఆర్
హాథ్రస్ కేసులో హత్యాచారానికి గురైన యువతికి, ఆమె కుటుంబానికి వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్ యంత్రాంగం కీలక చర్యలకు ఉపక్రమించింది. దళిత యువతి మృతదేహాన్ని బలవంతంగా కాల్చేసిన తర్వాత ఈ కేసుకు సంబంధించిన నెరేటివ్ పూర్తిగా మారిపోయింది. ఆ క్రమంలోనే తాము అమాయకులమని, యువతిని చంపింది ఆమె తల్లి, సోదరులేనని నిందితులు లేఖ రాయగా, ఈ వ్యవహారంలో నక్సల్స్ ప్రమేయం కూడా ఉందని యూపీ పోలీసులు తాజాగా నిర్ధారించారు. మరోవైపు అలహాబాద్ హైకోర్టు, కేంద్ర సంస్థ సీబీఐ సైతం ఈ కేసులో కీలక అడుగులు వేశాయి.
దళితుల్ని మనుషులుగా చూడరు - ఇది సిగ్గుపడాల్సిన వాస్తవం - రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
బాధిత కుటుంబానికి నక్సల్స్ శిక్షణ..
హాథ్రస్ ఘటనలో యోగీ సర్కార్ను అభాసుపాలుచేయడానికి అంతర్జాతీయ స్థాయిలో కుట్ర జరిగిందని గతంలో ఆరోపించిన పోలీసులు.. తాజాగా నక్సల్స్ ప్రమేయాన్ని ధ్రువీకరించారు. హత్యాచార ఘటన తర్వాత నక్సల్స్తో సంబంధాలున్న ఓ మహిళ.. హాథ్రస్ లోని బాధితురాలి ఇంటికి వచ్చి కొన్నాళ్లు అక్కడే గడిపిందని పోలీసులు చెప్పారు. ‘‘మధ్యప్రదేశ్లోని జబల్పూర్కు చెందిన మహిళా డాక్టర్ రాజ్కుమారికి నక్సల్స్ తో సంబంధాలున్నాయి. హాథ్రస్ కు వచ్చిన ఆమె.. మీడియాకు ఎలాంటి ప్రకటనలు ఇవ్వాలో బాధితకుటుంబ సభ్యులకు శిక్షణ ఇచ్చింది'' అని సీనియర్ పోలీసు అధికారి ఒకరు మీడియాకు వివరించారు. హాథ్రస్ ఘటన తర్వాత ‘‘భీమ్ పార్టీ''కి చెందిన కొంతమంది బాధిత కుటుంబంతో కలిసి ఉన్నారని కూడా పోలీసులు చెప్పారు. ఇదిలా ఉంటే..
డాక్టర్ రమేశ్ బాబు వింత వాదన
అలీగఢ్ ప్రభుత్వ ఆస్పత్రిలో హాథ్రస్ బాధితురాలికి వైద్య సేవలు అందించిన డాక్టర్ రమేశ్బాబు సంచలన విషయాలను వెల్లడించారు. ‘‘అత్యాచారం జరిగిందన్న విషయం ఆమె(బాధితురాలు)గానీ, పక్కనే ఉన్న తల్లిగానీ నాకు చెప్పలేదు. అత్యాచారం జరిగిందన్న సంగతి మాకు తెలీదు. ఆమె(బాదితురాలి) పరిస్థితి విషమం కావడంవల్లే మరో ఆస్పత్రికి కేసును రిఫర్ చేశా. ఆ సమయంలో ఎమర్జెన్సీ వార్డులో జనం కూడా కిక్కిరిసి ఉన్నారు'' అని సదరు డాక్టర్ మీడియాతో అన్నారు. బాధితురాలికి ఏం జరిగిందో తెలియలేదనడం డాక్టర్ చెప్పడం వింతగా ఉందని పలువురు విమర్శించారు.
చంద్రబాబు ఆయువుపట్టుపై దాడి - జస్టిస్ ఎన్వీ రమణపై జగన్ సంచలనం -ప్రధాని మోదీని కలిసిన రోజే
హైకోర్టు ముందుకు బాధిత కుటుంబం..
హాథ్రస్ కేసులో యూపీ పోలీసులు, అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో అలహాబాద్ హైకోర్టు ఈ వ్యవహారాన్ని పరిశీలనకు తీసుకుంది. ఈ క్రమంలోనే బాధిత కుటుంబం సోమవారం అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ ఎదుట హాజరుకానున్నారు. బాధితురాలి తరపు నోడల్ అధికారిగా హాథ్రస్ జిల్లా న్యాయమూర్తి వ్యవహరిస్తారని ఎస్పీ వినీత్ జైశ్వాల్ చెప్పారు. బాధిత కుటుంబ సభ్యుల రాక సందర్భంగా అంతటా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
Recommended Video
హాథ్రస్ కేసులో సీబీఐ ఎఫ్ఐఆర్
గ్యాంగ్ రేప్ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేయగా, కేంద్ర దర్యాప్తు సంస్థ పని మొదలుపెట్టింది. హాథ్రస్ కేసులో సీబీఐ ఆదివారం తొలి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. బాధితురాలి వాగ్మూలానికి భిన్నంగా రేప్ జరగలేదని, ఈ వ్యవహారంలో అంత్జాతీయ కుట్ర, నక్సల్స్ ప్రమేయం ఉందని యూపీ పోలీసులు వాదిస్తున్న నేపథ్యంలో సీబీఐ దర్యాప్తు కీలకంగా మారింది.