జయ జయ ‘జియో ’హే! ప్రపంచంలోనే అతిపెద్ద 4జీ నెట్వర్క్, 13 కోట్లకు పైగా వినియోగదార్లు!
భారత్లోనే కాదు.. అంతర్జాతీయంగానూ రిలయన్స్ జియో పలు రికార్డులు సృష్టించిందని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. ఏడాదిలోనే జియో 13 కోట్లకు పైగా వినియోగదార్లను జత చేసుకుంది.
ముంబై: భారత్లోనే కాదు.. అంతర్జాతీయంగానూ రిలయన్స్ జియో పలు రికార్డులు సృష్టించిందని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. కార్యకలాపాలు ప్రారంభించిన ఏడాదిలోనే 13 కోట్లకు పైగా వినియోగదార్లను జత చేసుకుందని ఉద్యోగులకు రాసిన లేఖలో ఆయన తెలిపారు.
'గత ఏడాది కాలంలో మనం ఇటు భారత్లో.. అటు అంతర్జాతీయంగానూ పలు రికార్డులు బద్దలు కొట్టాం. వీటన్నిటికంటే భారత్ అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోలేదన్న భ్రమను బద్దలు కొట్టడమే నాకు వ్యక్తిగతంగా సంతృప్తి కలిగించింది' అని పేర్కొన్నారు.
ట్రాయ్ గణాంకాల ప్రకారం.. జూన్ చివరినాటికి జియో వినియోగదార్ల సంఖ్య 12.33 కోట్లుగా ఉంది. 'మనమంతా కలిసి ప్రపంచంలోనే అతిపెద్ద పూర్తి స్థాయి 4జీ నెట్వర్క్ను సృష్టించాం. డేటా వినియోగంలో భారీ మార్పు వచ్చింద'ని ముకేశ్ అన్నారు. జియో సేవల ప్రారంభంతో 1 జీబీ మొబైల్ డేటా వ్యయం రూ.10 కంటే తక్కువకు వచ్చింది. అంతకుముందు ఇతర ఆపరేటర్లు 1 జీబీ డేటాకు రూ.250 దాకా ఛార్జీ వసూలు చేసే వారు.
గతేడాది సెప్టెంబరు 5న రిలయన్స్ జియో మొబైల్ సేవలను వాణిజ్యపరంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. అపరిమిత వాయిస్ కాల్స్కు తోడు అపరిమిత 4జీ డేటాను 90 రోజుల పాటు ఉచితంగా అందించింది.
కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాతి నెలలో భారత టెలికాం రంగం ఇది వరకెన్నడూ లేని విధంగా అత్యధిక వినియోగదార్లను జత చేసుకుంది. అక్టోబరులో భారత టెలికాం వినియోగదార్ల సంఖ్య 110 కోట్లకు చేరింది. ఆ నెలలో అత్యధికంగా 2.9 కోట్ల మంది వినియోగదార్లు జత కావడం ఒక రికార్డు. ఇందులో జియో వాటా 1.96 కోట్లు కావడమూ రికార్డే.
'మౌలిక వసతులను, సాంకేతికతను సమర్థంగా ఉపయోగించుకోవడం ద్వారా అవిశ్రాంతంగా 13 కోట్లకు పైగా వినియోగదార్లకు మీరు సేవలందించడంతో జియోను అందరికీ ప్రీతిపాత్రమైన కంపెనీగా మలిచారు' అని ఉద్యోగులను ముకేశ్ ప్రశంసించారు.