శభాష్ నమితా: 8 నెలల గర్భంతో అసెంబ్లీ సమావేశాలకు.. నియోజకవర్గ సమస్యల కోసమే..
ప్రజా ప్రతినిధి అంటే ప్రజల సమస్యలు తెలుసుకోవాలి. వారికి పరిష్కారం చూపించాలి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి సిచుయేషన్ లేదు. కానీ మహారాష్ట్రలో ఓ నేత మాత్రం తాను అసలు సిసలైన నేత అని నిరూపించుకున్నారు. ఎందుకంటే ఆమె ఎనిమిది నెలల గర్భంతో కూడా అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. తన నియోజకవర్గ సమస్యల కోసమే సభకు వచ్చానని.. సభలో ప్రసంగించి, ఇతర సభ్యుల నుంచి ప్రసంశలు అందుకొన్నారు.
మహారాష్ట్రలోని బీడ్ నియోకవర్గ బీజేపీ ఎమ్మెల్యే నమితా ముందాడ. 30 ఏళ్ల మహిళా నేత 8 నెలల గర్భవతి కూడా. ఎన్నికలకు కొద్దిరోజుల ముందు బీజేపీలో చేరి పోటీ చేసి గెలుపొందారు. బీజేపీ-శివసేన మధ్య సీఎం పీఠం కోసం ఏర్పడిన అనిశ్చితితో తెరపైకి శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి వచ్చి ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసిందే. అయితే బీడ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న నమితా గర్భవతి.. అయినా మహారాష్ట్రలో బడ్జెట్ సమావేశాలు కొనసాగుతోన్న నేపథ్యంలో.. ఆమె హాజరవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
సభలో తనవంతు వచ్చిన సమయంలో నమితా మాట్లాడారు. తాను 8 నెలల గర్భవతినని చెప్పుకొచ్చారు. నియోజకవర్గ సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చేందుకు సమావేశాలకు హాజరయ్యానని పేర్కొన్నారు. సమావేశాల్లో పాల్గొనడం తన బాధ్యత అని, దానిని మరవనని స్పష్టంచేశారు. గర్భవతిగా వైద్యుల సలహాలను పాటిస్తూనే ప్రజల కోసం అసెంబ్లీ సమావేశానికి వచ్చానని నమిత పేర్కొన్నారు.