నైతిక విలువలకు కట్టుబడి పనిచేసారు.. హాట్సాఫ్ సర్..! కర్ణాటక స్పీకర్ కు అందుతున్న ప్రశంసలు..!!
బెంగళూరు/హైదరాబాద్ : కర్ణాటకలో ఇప్పుడు ఎవరి నోటి వెంట విన్నా స్పీకర్ రమేష్ కుమార్ మాటే..! సొంత పార్టీ నేతలే కాకుండా విపక్ష పార్టీ నేతలు కూడా ఆయనను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. విలువలతో కూడిన రాజకీయాలు చేయటం అంత తేలికైన పని కాదు. పార్టీలకు అతీతంగా తాను కూర్చున్న కుర్చీకి తగ్గట్లు న్యాయంగా, ధర్మంగా వ్యవహరిస్తూ కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు సైతం వెనక్కి తగ్గని నేర్పున్న నేతలు ఈ మధ్య కాలంలో కనిపించ లేదు. స్పీకర్ కుర్చీ అంటే, అధికారపక్ష అధినేత కనుసైగకు తగ్గట్లుగా పని చేసేదన్న భావనకు చెక్ చెప్పటమే కాకుండా, స్పీకర్ తలుచుకుంటే సీన్ ఎలా మారుతుందన్న విషయాన్ని చేతల్లో చేసి చూపించిన ఘనతను కర్ణాటక స్పీకర్ రమేశ్ కుమార్ కే దక్కుతుంది. అందుకే ఆయనను ఇప్పుడు అందరూ, 'స్పీకర్ సీటుకే వన్నె తెచ్చారు' అంటూ అభినందిస్తున్నారు.
కర్ణాటక స్పీకర్ కు ప్రశంసలు..! రాజకీయ విలువలను కాపాడారంటూ పొగడ్తలు..!!
కర్ణాటక రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం గడిచిన కొన్ని వారాలుగా ఎడతెగని రీతిలో సాగింది. కుమారస్వామి ప్రభుత్వం పైన వేటు వేస్తూ, కూటమి నేతలు పలువురు పార్టీ ఫిరాయిండం, వారిపై చర్యలకు డిమాండ్లు ఒకపక్క, మరో వైపు కొత్త తరహా ఒత్తిళ్ల మధ్య నలిగిపోయిన రమేశ్ కమార్, స్పీకర్ కుర్చీకి న్యాయం చేస్తూ ఏం చేయాలో దాన్ని క్రమపద్ధతిలో చేసేసిన వైనం ఇప్పుడు కన్నడ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
గత కొన్ని రోజులుగా కర్ణాటకలో నాటకీయ పరిణామాలు..! చాకచక్యంగా వ్యవహరించిన సాధించిన స్పీకర్..!!
యడ్డి ప్రభుత్వం బలపరీక్షను ఎదుర్కోవటానికి ఒక రోజు ముందు 17 మంది ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేసి సంచలనం సృష్టించిన ఆయన.. ఈ రోజు జరిగి బలపరీక్షలో పాస్ కావటానికి వీలుగా ఆయన నిర్ణయం ఉందన్న విమర్శలు వెల్లువెత్తాయి. అయితే.. తన ముందుకు వచ్చిన అంశాలపై న్యాయసూత్రాలకు అనుగుణంగా తాను చర్యలు తీసుకున్నట్లుగా ఆయన స్పష్టం చేశారు.
హుందాగా వ్యవహరించారు..! మెచ్చుకుంటున్న కమలం నేతలు..!!
ఇదిలా ఉంటే.. బలపరీక్ష పూర్తి అయిన వెంటనే.. స్పీకర్ పదవికి రాజీనామా చేసి మరోసారి వార్తల్లోకి వచ్చేశారు. బలపరీక్షలో బీజేపీ గెలిచిన నేపథ్యంలో తాను కాంగ్రెస్ తరఫున ప్రతిపాదించిన స్పీకర్ కావటంతో ఆయనీ నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు. ఇప్పుడున్న రాజకీయాలకు భిన్నంగా ఏం చేసినా రూల్ ప్రకారమే చేస్తానని చెప్పటం.. అందుకు తగ్గట్లు వ్యవహరించటం రమేశ్ కుమార్ లాంటి వారికే సాధ్యమని చెప్పకతప్పదు. తన తాజా నిర్ణయంతో తన ప్రత్యేకతను రమేశ్ చాటుకున్నారు. స్పీకర్ కుర్చీకి వన్నె తెచ్చారు.
కుదుట పడ్డ రాజకీయాలు..! కొలువుదీరనున్న బీజేపి ప్రభుత్వం..!!
కొన్ని రోజులుగా రాజకీయ అస్థిరత కర్ణాటకను కుదిపేస్తోంది. స్పికర్ 17మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడంతో అనుకోని ఆపద చోటుచేసుకుంది బీజేపీకి. ఈ 17స్థానాల్లో బీజేపీకి అంతగా పట్టులేకపోవడం, మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తే గెలుపు ఆశలు తక్కువే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కనీసం ఈ 17స్థానాల్లో 8అయిన బీజేపీ దక్కించుకుంటే స్థిరమైన ప్రభుత్వం ఏర్పడుతుంది. బీజేపీ నాయకులు మాత్రం అన్ని స్థానాల్లోనూ తమదే విజయమంటున్నారు. కేంద్రంలో స్థిరంగా ఏర్పడిన బీజేపీకి కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడం అంతపెద్ద విషయం కాదన్నది మరికొందరి మాట. సోమవారం జరిగిన బలపరీక్షలో 224 మంది ఎమ్మెల్యేలకు గానూ 207మంది ఎమ్మెల్యేలు ఉన్న అసెంబ్లీలో బీజేపీ నెగ్గింది. బీజేపీ ప్రభుత్వం 104మంది మ్యాజిక్ ఫిగర్ ను సాధించింది. బలపరీక్షలో బీజేపీకి మద్దతుగా ఇండిపెండెంట్ ఎమ్మెల్యేతో కలిపి 106మంది ఓటు వేయడంతో ఆ పార్టీ విజయం సాధించింది. దీంతో కొంగొత్తగా మళ్లీ కన్నడ రాష్ట్రంలో కమలం పార్టీ కొలువుదీరనుంది.