మూణ్నెళ్లుగా నన్ను వేధిస్తున్నారు, సింధు జలాలు పంజాబ్కు: మోడీ
గత మూడు నెలలుగా తన పైన విపక్షాలు దాడి చేస్తున్నాయని, వేధిస్తున్నాయని, అయినప్పటికీ తాను ఎట్టి పరిస్థితుల్లో లొంగేది లేదని ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం నాడు అన్నారు.
జలంధర్: గత మూడు నెలలుగా తన పైన విపక్షాలు దాడి చేస్తున్నాయని, వేధిస్తున్నాయని, అయినప్పటికీ తాను ఎట్టి పరిస్థితుల్లో లొంగేది లేదని ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం నాడు అన్నారు.
పంజాబ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జలందర్లో బహిరంగ సభలో మాట్లాడారు. ఓసారి 2013-14 నాటి పత్రికలు తిరగేసి చూస్తే ఎంత డబ్బు కుంభకోణాల్లో పోయిందో, ఇప్పటి పత్రికలు చూస్తే ఎంత డబ్బు వెనక్కి వచ్చిందో తెలుస్తుందన్నారు.
డెబ్బై ఏళ్లుగా తాము దోచుకున్న సంపద మొత్తం కరిగిపోతుంటే కొంతమంది వ్యక్తులు దానిని జీర్ణించుకోలేకపోతున్నారని కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. గత నలభై ఏళ్లుగా నానుతున్న వన్ ర్యాంక్ వన్ పెన్షన్ను తాము అమలు చేశామన్నారు.
సింధూ జలాల్లో మనకు న్యాయంగా రావాల్సిన నీటిని తీసుకొని, దానిని పంజాబ్కు ఇస్తామన్నారు. గత డెబ్బై ఏళ్లుగా మనం విధ్వంస రాజకీయాలు చూస్తున్నామని, ఇప్పుడు మాత్రం రాజకీయాలు అంటే అభివృద్ధి చేసి తీరాల్సిందేనని అన్నారు. తాము అదే చేస్తున్నామన్నారు.
తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి బాదల్ తన చేయి పట్టుకొని మార్గదర్శిగా ఉన్నారన్నారు. తాను ప్రధాని అయిన తర్వాత తనను కలిసినప్పుడల్లా రైతుల సమస్యలు తన దృష్టికి తెస్తున్నారన్నారు. ఆయన తన ఇన్నేళ్ల జీవితంలో ఒక్కసారి పార్టీ గానీ, సిద్ధాంతాలు గాని మార్చుకోలేదన్నారు.
యూపీలో కాంగ్రెస్ ఎప్పుడూ సమాజ్ వాది పార్టీని విమర్శించలేదని, ఓటర్లు పట్టించుకోకపోవడంతో అదే పార్టీతో చేతులు కలిపిందన్నారు. కాంగ్రెస్ ఎంత ప్రయత్నించినా పంజాబ్ ప్రజలు బాదల్ను సీఎం చేస్తారన్నారు.
కొందరు పంజాబ్ పేరు చెడగొట్టాలనుకుంటున్నారని, అలాంటి వారిని ప్రజలు శిక్షించాలన్నారు. పంజాబ్ ఓ రాష్ట్రం కాదన్నారు. దేశం మొత్తంలో పంజాబ్ తిండి తనని పౌరుడు ఒక్కరూ ఉండరన్నారు. ఇక్కడి వారు సాధవులు, ధైర్యవంతులు, త్యాగధనులు అన్నారు.