నా తండ్రి హంతకులను క్షమిస్తున్నా: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ:మాజీ ప్రధానమంత్రి రాజీవ్గాంధీ హత్య కేసులో నిందితులను క్షమిస్తున్నామని ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్గాంధీ ప్రకటించారు. సింగపూర్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు.
మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ తమిళనాడులో ఎన్నికల ప్రచారసభలో బాంబుదాడిలో మృతి చెందాడు. ఈ దాడిలో పాల్గొన్న నిందితుల్లో కొందరు ప్రస్తుతం జైల్లో శిక్షను అనుభవిస్తున్నారు. ఈ కేసులో అరెస్టైన నిందితుల గురించి రాహుల్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు.
నా తండ్రి హత్య తర్వాత మా కుటుంబం ఆ బాధ నుంచి కోలుకోవటానికి చాలా సమయం పట్టింది. ఏది ఏమైనా నేనూ, నా సోదరి ప్రియాంక కూడ హంతకులను క్షమించారని రాహుల్ ఆ సమావేశంలో ప్రకటించారు.
రాజకీయాల్లో దుష్ట శక్తులతో పోరాడే సమయంలో.. మీరు ఓ వైపు నిలిచినప్పుడు ఖచ్ఛితంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇక్కడా అదే జరిగింది. మా నాన్నమ్మ, తండ్రి ఆ క్రమంలోనే ప్రాణాలు కోల్పోయారని రాహుల్ అభిప్రాయపడ్డారు.
అప్పటి పరిస్థితులను బట్టి వాళ్లు చనిపోతారని మా కుటుంబం ముందే ఊహించింది. తాను చనిపోతానని నాన్నమ్మ నాతో తరచూ అనేవారు. ఆమె చెప్పినట్లే ఆమెను హతమార్చారు. అది చూశాక మీరు కూడా చనిపోతారని నా తండ్రితో నేను అన్నాను. ఊహించినట్లే జరిగింది. విధి బలీయమైందని రాహుల్ ఉద్వేగంగా ప్రసంగించాడు.
కాగా, గతంలో జయలలిత సీఎంగా ఉన్న సమయంలో రాజీవ్ గాంధీ హత్య కేసు నిందితులను విడుదల చేసేందుకు ప్రతిపాదన చేశారు. అయితే దానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఆ సమయంలో ఈ వ్యవహారంపై స్పందించేందుకు రాహుల్ విముఖత వ్యక్తం చేశారు.