మిగ్ విమానాలు ఉన్నాయి కాబట్టే వినియోగించాం: మిగ్ 21 యుద్ధ విమానంపై ధనోవా వ్యాఖ్యలు
గతవారం భారత గగనతలంలోకి వచ్చి భారత మిలటరీ స్థావరాలపై దాడి చేసేందుకు ప్రయత్నించాయి పాక్ యుద్ధవిమానాలు ఎఫ్-16. ఈ ఎఫ్-16 యుద్ధ విమానాలను భారత గగనతలంలో చూసిన వెంటనే భారత్కు చెందిన యుద్ధ విమానం మిగ్-21 వాటిని తరిమికొట్టే ప్రయత్నం చేశాయి. ఈ విమానంనే ఇండియన్ ఎయిర్ఫోర్స్ పైలట్ అభినందన్ కమాండింగ్ చేశాడు. అయితే ఆయన యుద్ధ విమానంను ఓ క్షిపణి దాడి చేయడంతో అది కూలిపోయింది. అందులో పైలట్గా ఉన్న అభినందన్ మాత్రం శత్రుదేశానికి దొరికిపోయాడు. ఇక అత్యంత అప్డేటెడ్ టెక్నాలజీ కలిగి ఉన్న ఎఫ్-16 యుద్ధ విమానంతో ఎప్పుడో ఔట్డేటెడ్ అయిన మిగ్-21 యుద్ధ విమానం పోటీ పడగలదా అనే ప్రశ్నకు వాయుసేన దళాధిపతి బీఎస్ దనోవా స్పందించారు. కోయంబతూరులో ఉన్న ఆయన్ను మీడియా ప్రశ్నించగా... అందుకు యుద్ధానికి ఫలానా విమానంను మాత్రమే వినియోగించాలనేది ఏమిలేదని మనదగ్గర ఉన్న అన్ని విమానాలను వినియోగిస్తామని చెప్పారు.
బాలాకోట్లో భారత వైమానిక దళం దాడులు చేసిన తర్వాత మరుసటి రోజు పాక్ ఎఫ్ -16 యుద్ధ విమానాలు మన దేశంపైకి వచ్చి దాడి చేసేందుకు ప్రయత్నించాయి. ఆ సమయంలో మిగ్-21 యుద్ధ విమానం పాక్ యుద్ధ విమానాన్ని తరుముకుంటూ వెళ్లింది. ఇందులో పాకిస్తాన్కు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానంను మిగ్ -21 కూల్చేసింది. దురదృష్టవశాత్తు భారత్కు చెందిన మిగ్-21 బైసన్ యుద్ధ విమానం కూడా శత్రుదేశం యొక్క క్షిపణి దాడిలో కూలిపోయింది. గతవారం జరిగిన దాడిపై భారత్ ఇంకా ఎందుకు పాతతరానికి చెందిన మిగ్లపైనే ఆధారపడుతోందనే చర్చ జరుగుతోంది. శత్రుదేశం అల్ట్రా మోడ్రన్ ఎఫ్-16 యుద్ధ విమానాలు వినియోగిస్తుండగా మన దేశం మాత్రం ఇంకా పాతకాలం నాటి మిగ్ యుద్ధ విమానాలనే దాడులకు వినియోగించడం సురక్షితం కాదనే వాదన వినిపిస్తోంది.
ఇదే విషయమై ఎయిర్ ఛీఫ్ మార్షల్ బీఎస్ ధనోవాను మీడియా అడిగితే మిగ్ 21 యుద్ధ విమానం మన రక్షణ వ్యవస్థలో ఉన్నప్పుడు దాన్నెందుకు వాడకుండా పక్కకు పెడుతామని ఎదురు ప్రశ్న వేశారు. అంతేకాదు ఇది పాతకాలం యుద్ధ విమానం అయినప్పటికీ సాంకేతికంగా అప్డేట్ చేశామని దనోవా వివరించారు. మిగ్ -21 బైసన్ యుద్ధ విమానం పాతకాలం మిగ్ -21 బైసన్లా లేదని మొత్తం మార్చేశామని చెప్పుకొచ్చారు. అప్డేట్ అయిన ఈ యుద్ధ విమానంలో మంచి ఆయుధ వ్యవస్థ కలిగి ఉందని అంతేకాక గగనతలం నుంచి గగనతలంలోనే శత్రువులను కూల్చగల అత్యాధునిక క్షిపణి వ్యవస్థ ఉందని వెల్లడించారు.
భారత అమ్ములపొదిలో చాలా యుద్ధ విమానాలు ఉన్నాయి. అయితే సమయం సందర్భంను బట్టి వాడటం జరుగుతుంది. ప్రస్తుతం భారత్కు మరిన్ని యుద్ధ విమానాల అవసరం ఉంది. ప్రస్తుతం భారత ఎయిర్ఫోర్స్లో సోవియట్ కాలంనాటి మిగ్-21, మిగ్-27, మిగ్-29, యూరోపియన్ జాగ్వార్, భారత్కు చెందిన తేజస్, ఫ్రాన్స్కు చెందిన మిరాజ్, రష్యాకు చెందిన సుఖోయ్-30 యుద్ద విమానాలు ఉన్నాయి. ఇందులో ఫిబ్రవరి 26న బాలాకోట్పై మెరుపుదాడి చేసేందుకు మిరాజ్ యుద్ధ విమానాలను భారత వైమానిక దళం వినియోగించింది. ఇక త్వరలోనే ఫ్రాన్స్కు చెందిన రాఫెల్ యుద్ధ విమానాలు కూడా రక్షణ వ్యవస్థలో వచ్చి చేరుతాయి.