చరిత్ర చూద్దాం: జమ్మూ కశ్మీర్లో ఎన్నిసార్లు గవర్నర్ పాలన విధించారో తెలుసా..?
జమ్మూ కశ్మీర్లో గవర్నర్ పాలన వచ్చింది. అయితే గవర్నర్ పాలన ఆ రాష్ట్రానికి కొత్తేమీ కాదు. ఇప్పటి వరకు 8 సార్లు జమ్ముకశ్మీర్లో గవర్నర్ పాలన విధించడం జరిగింది. మొదట్లో కశ్మీరీలు గవర్నర్ పాలనను వ్యతిరేకిస్తూ నిరసనలు చేసినా... కాలక్రమంలో వారుకూడా ఈ పాలనకు అలవాటు పడ్డారు. అయితే తాజాగా విధించిన గవర్నర్ పాలనతో ఎవరూ నిరాశకు గురికాలేదు.
జమ్మూ కశ్మీర్లో ఇప్పటి వరకు విధించిన గవర్నర్ పాలన సంఘటనలు ఇలా ఉన్నాయి. గవర్నర్ పాలన జమ్మూ కశ్మీర్లో తొలిసారిగా 1977 మార్చిలో విధించారు. అంతకు రెండేళ్ల ముందు అంటే 1975లో ఆ రాష్ట్ర సీఎంగా షేక్ అబ్దుల్లా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు 1974లో ఇందిరిగాంధీతో చరిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకున్నారు.ఎమర్జెన్సీ సమయంలో కూడా ఆయన జమ్మూకశ్మీర్ రాష్ట్ర సీఎంగా ఉన్నారు. ఎమర్జెన్సీ ఎత్తివేసిన ఐదురోజులకు అంటే 1977 మార్చి 21న ఇందిరా గాంధీ షేక్ అబ్దుల్లాకు మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. గవర్నర్ ఎల్ఎన్ ఝా కింద ఆ రాష్ట్రం గవర్నర్ పాలనలోకి వెళ్లింది. దాదాపు 105 రోజుల పాటు గవర్నర్ పాలన విధించడం జరిగింది. ఆ తర్వాత జూన్ 1977లో జరిగిన ఎన్నికల్లో జమ్మూకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ విజయఢంకా మోగించి తిరిగి షేక్ అబ్దుల్లా సీఎంగా బాధ్యతలు చేపట్టారు.
షేక్ అబ్దుల్లా మృతి తర్వాత జమ్ముకశ్మీర్లో రాజకీయ అస్థిరత
1982లో షేక్ అబ్దుల్లా మృతి తర్వాత జమ్ముకశ్మీర్లో రాజకీయ అస్థిరత నెలకొంది. అబ్దుల్లా కుమారుడు ఫరూక్ అబ్దుల్లా పార్టీలోని సొంత వ్యక్తులతోనే విభేదించి తిరిగి రాజీవ్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారు. అదే సమయంలో గవర్నర్గా ఝా దిగిపోవాల్సి వచ్చింది. కొత్త గవర్నర్గా బీకే నెహ్రూను కేంద్రం నియమించింది. అయితే ఫరూక్ అబ్దుల్లాను డిస్మిస్ చేయాలని ఇందిరా గాంధీ ఒత్తిడి తీసుకొచ్చారని అయితే తాను తన మాటను లెక్కచేయలేనందున తనను గవర్నర్ నుంచి తప్పించినట్లుగా ఝా ఓ పుస్తకంలో రాసుకున్నారు.
నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలో చీలిక తీసుకురావడంలో ఇందిర సఫలం
ఆ తర్వాత 12 రోజుల వరకు వీకే ఖాలిద్ జమ్ముకశ్మీర్ గవర్నర్గా బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఇందిరకు అత్యంత నమ్మకస్తుడిగా ముద్రపడ్డ లెఫ్టినెంట్ జగ్మోహన్ జమ్మూకశ్మీర్ గవర్నర్గా నియమితులయ్యారు.నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలో చీలిక తీసుకురావడంలో ఇందిర సఫలం అయ్యారు. దీంతో ఫరూక్ అబ్దుల్లాను డిస్మిస్ చేశారు. ఫరూక్ అబ్దుల్లా బావమరిది గులామ్ మహ్మద్ షా సీఎంగా బాధ్యతలు చేపట్టారు.
1987లో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు
మహ్మద్ షాకు కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించుకోవడంతో మార్చి 1986లో గవర్నర్ పాలన రెండో సారి విధించడమైంది. అప్పటికే రాజీవ్ గాంధీ ఫరూక్ అబ్దుల్లాల ఒప్పందం ప్రకారం ఫరూక్ అబ్దుల్లా సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 1987లో కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలో దిగాయి. అయితే అప్పటి వరకు ఎప్పుడూ లేనంతగా ఆ ఎన్నికల్లో భారీ బహిరంగ రిగ్గింగ్ జరిగిందని నేటికీ చెప్తారు. 1990లో జగ్మోహన్ను తిరిగి జమ్మూకశ్మీర్ గవర్నర్గా నియమించారు. అప్పటికే కశ్మీర్ అల్లకల్లోలమైన పరిస్థితుల్లో ఉంది. ఓ సీఆర్పీఎఫ్ జవాను నిరసన తెలుపుతున్న 50 మందిని కాల్చి చంపాడు. దీంతో సీఎంగా ఉన్న ఫరూక్ అబ్దుల్లా రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో మళ్లీ రాజకీయ అస్థిరత నెలకొని 6ఏళ్లపాటు జమ్ముకశ్మీర్లో గవర్నర్ పాలన విధించారు. 1996లో జరిగిన ఎన్నికల్లో ఎన్సీ పార్టీ విజయం సాధించి 2002 వరకు ప్రభుత్వంలో కొనసాగింది.2002లో జరిగిన ఎన్నికల్లో హంగ్ రావడంతో మళ్లీ రాష్ట్రం గవర్నర్ పాలనకిందికి వెళ్లింది. అయితే ఈ సారి అక్టోబర్ 17 నుంచి నవంబర్ 2 వరకు అంటే 15 రోజుల పాటు రాష్ట్రంలో గవర్నర్ పాలన విధించడం జరిగింది. అనంతరం పీడీపీ, కాంగ్రెస్ ఇతర ఇండిపెండెంట్లతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు జరిగింది. సీఎం పదవిని పీడీపీ కాంగ్రెస్ పంచుకుంది.
వోరా గవర్నర్గా ఉన్న సమయంలోనే మూడుసార్లు గవర్నర్ పాలన
ముఫ్తీ మహ్మద్ సయీద్ 2005 వరకు సీఎంగా ఉండగా.. 2005 తర్వాత గులాం నబీ ఆజాద్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అమర్నాథ్ భూముల వ్యవహారంలో పీడీపీ కాంగ్రెస్కు మద్దతు ఉపసంహరించుకోగా మళ్లీ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. దీంతో ఐదవసారి రాష్ట్రంలో గవర్నర్ పాలన విధించడం జరిగింది. ఇది జూలై 11,2008 నుంచి జనవరి 5, 2009 వరకు సాగింది.ఎన్ఎన్ వోరా గవర్నర్గా ఉన్నసమయంలోనే రాష్ట్రంలో మూడుసార్లు గవర్నర్ పాలన విధించడమైంది. తాజాగా బీజేపీ పీడీపీకి మద్దతు ఉపసంహరించుకోవడంతో మళ్లీ గవర్నర్ పాలన విధించక తప్పలేదు. 2015లో జమ్ముకశ్మీర్ సీఎంగా ఉన్న ముఫ్తీ సయీద్ మృతి చెందడంతో ఆయన కుమార్తె మెహబూబా ముఫ్తీ సీఎంగా బాధ్యతలు చేపట్టేందుకు 87 రోజుల సమయం పట్టింది. ఆ సమయంలో కూడా రాష్ట్రం గవర్నర్ పాలనలోకి వెళ్లింది. ఇలా రాజకీయ అస్థిరతతో జమ్మూకశ్మీర్లో మొత్తం 8 సార్లు గవర్నర్ పాలన విధించడమైంది.