బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన బీహార్ మాజీ మంత్రి
రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న బీహార్ మాజీ మంత్రి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ చూపు సినిమాల వైపు మళ్లినట్లు కనిపిస్తోంది. తేజ్ ప్రతాప్ యాదవ్ మంత్రిగా ఉన్న సమయంలో అంటే 2016లో ఓ భోజ్పూరి సినిమాలో ముఖ్యమంత్రిగా కనిపించి యాక్టింగ్లో తన స్టామినా ఏమిటో నిరూపించుకున్నాడు. ఇప్పుడు తాజాగా బాలీవుడ్లోకి బాబు ఎంటర్ అయ్యారు.
'రుద్ర ద అవతార్' పేరుతో వస్తున్న హిందీ సినిమాలో తేజ్ ప్రతాప్ యాదవ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ను ఆయన తన అధికారిక ట్విటర్లో పోస్ట్ చేశారు. ఇందులో నల్లకళ్ల జోడు ధరించి ఉన్నారు తేజ్ ప్రతాప్ యాదవ్. అయితే గతనెలలోనే తేజ్ ప్రతాప్ వివాహం చేసుకున్నారు. తనకు దైవభక్తి ఎక్కవ అని తన సన్నిహితులు చెబుతున్నారు. వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఆలయాలను తేజ్ తరుచూ సందర్శిస్తుంటారని చెబుతున్నారు.
తన సోదరుడు తేజశ్వి యాదవ్ మాత్రం లాలూ ప్రసాద్ యాదవ్ రాజకీయ వారసుడిగా ఇప్పటికే ఫోకస్ అయ్యారు. అంతేకాదు ఆర్జేడీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా తేజశ్వి యాదవ్నే ఆ పార్టీ అధినేత లాలూ ప్రతిపాదించారు.