ప్లీజ్, మమ్మల్ని వదిలేయండి, వేధించొద్దు: లోయ ఫ్యామిలీ ఉద్వేగం
న్యూఢిల్లీ: మా తండ్రి మృతిపై మాకు ఎలాంటి అనుమానాలు లేవని, దీనిని రాజకీయం చేయవద్దని, దయచేసి తమను వదిలేయాలని సీబీఐ జడ్జి బీహెచ్ లోయ తనయుడు అంజు లోయా, కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు. తమను రాజకీయ బాధితులుగా చేయవద్దని, స్వప్రయోజనాల కోసం తమను లాగవద్దని కోరారు.
ఆయన కుమారుడు, ఇతర కుటుంబ సభ్యులు ఆదివారం మీడియా ఎదుట ఉద్వేగానికి లోనయ్యారు. తన తండ్రి మృతిని రాజకీయం చేయకుండా సంయమనం పాటించాలని రాజకీయ పార్టీలకు మనవి చేస్తున్నానని లోయ తనయుడు అన్నారు. గత కొద్ది రోజులుగా జరుగుతున్న సంఘటనలతో తమ కుటుంబం తీవ్ర ఆవేదనకు గురైందన్నారు.
దయచేసి తమను విచారించవద్దని లోయ తనయుడు అంజు లోయ అన్నారు. తన తండ్రి మృతిపై తొలుత తనకు అనుమానాలు ఉన్నప్పటికీ ఇప్పుడు తనకు ఎలాంటి అనుమానాలు లేవని చెప్పారు.
జస్టిస్ లోయ 2014 డిసెంబర్ 1న తన సహోద్యోగి కుమార్తె పెళ్లికి వెళ్లినప్పుడు గుండెపోటుతో మరణించారు. ఆ సమయంలో సోహ్రబుద్దీన్ షేక్ నకిలీ ఎన్కౌంటర్ కేసును కూడా లోయా విచారణ జరుపుతున్నారు.
ఇటీవల నలుగురు సుప్రీం సీనియర్ న్యాయమూర్తులు సీజేఐ దీపక్ మిశ్రాపై అసంతృప్తి వ్యక్తం చేసిన సమయంలో మరోసారి జస్టిస్ లోయ మృతి అంశం తెరపైకి వచ్చింది. లోయా అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడంటూ సుప్రీం ముందుకు పిటిషన్ రావడం కూడా న్యాయమూర్తుల మధ్య అభిప్రాయబేధాలు తలెత్తడానికి ఒక కారణమనే ప్రచారం ఉంది.