పేదరికమే నా కులం... బెహన్ జీ వ్యాఖ్యలకు మోడీ కౌంటర్..
లక్నో : రాజస్థాన్ ఆల్వార్లో సామూహిక అత్యాచార ఘటనపై రాజకీయ దుమారం కొనసాగుతూనే ఉంది. ఈ విషయంలో ప్రధాని నరేంద్రమోడీ, బీఎస్పీ చీఫ్ మాయావతి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. రాజకీయ లబ్ది కోసం కుల రాజకీయాలు పాల్పడుతున్నారన్న బెహన్ జీ వ్యాఖ్యలపై ప్రధాని స్పందించారు. ఇన్నేళ్ల తన రాజకీయ జీవితంలో ఏనాడూ ఓట్ల కోసం కులాన్ని వాడుకోలేదని స్పష్టం చేశారు.
ఉత్తర్ ప్రదేశ్ బలియాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోడీ.. తన కులం పేదరికమని, అందుకే దానిపై పోరాటం చేస్తున్నామని అన్నారు. 2014 ఎన్నికల్లోనూ తాను ఏనాడు కుల ప్రస్తావన తేలేదన్న విషయాన్ని ప్రధాని గుర్తుచేశారు.
రాజస్థాన్ ఆల్వార్లో జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై ప్రధాని నరేంద్రమోడీ మొసలి కన్నీరు కారుస్తున్నారని మాయావతి గతంలో ఆరోపించారు. దళితులపై కపట ప్రేమ చూపుతూ రాజకీయ లబ్ది పొందే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఓటర్లను ఆకట్టుకునేందుకే తాను ఓబీసీనని చెప్పుకుంటున్నారని బెహన్ జీ అన్నారు. దీనిపై స్పందించిన మోడీ తానెన్నడూ కుల రాజకీయాల జోలికి వెళ్లలేదని స్పష్టం చేశారు. తాను దేశం కోసం పనిచేస్తున్నానన్న ప్రధాని, ప్రతిపక్షాల తిట్లను బహుమతిగా స్వీకరిస్తానని అన్నారు.