మర్యాదగా ఉండండి: కాంగ్రెస్ ఎంపీకి సుప్రీం తలంటు
న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్ కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌధురికి సుప్రీం కోర్టులోనూ ఎదురుదెబ్బ తగిలింది. కాస్త మర్యాదగా ఉండటం నేర్చుకోవాలని సుప్రీంకోర్టు ఆయనకు తలంటింది. వివరాల్లోకి వెళితే.. నాలుగేళ్లుగా రంజన్ చౌధురి ఉంటున్న ప్రభుత్వ నివాసం నుంచి గత వారం ఖాళీ చేయించారు.
గడువు ముగిసినప్పటికీ ఆయన ఖాళీ చేయకపోవడంతో అధికారులు బలవంతంగా ఖాళీ చేయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా, దీన్ని సవాలు చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. 'ఇంకా ఎవరైనా వచ్చి మీకు ఇల్లు ఖాళీ చేయాలని చెప్పాలా' అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్ ప్రశ్నించారు.
అంతకుముందు హైకోర్టుకు వెళ్లినా కూడా బంగ్లా ఖాళీ చేసి తీరాల్సిందేనని అక్కడ సైతం అధిర్ పిటిషన్ను తిరస్కరించారు. పశ్చిమబెంగాల్ నుంచి నాలుగు సార్లు ఎంపీగా ఎన్నికై, గతంలో మంత్రిగా కూడా పనిచేసిన చౌధురి.. బంగ్లా ఖాళీ చేయాలని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి ఎదురైంది.
సరిగ్గా ఏడాది క్రితం కాంగ్రెస్ అధికారం కోల్పోయిన తర్వాత అధిర్ రంజన్ చౌధురికి వేరే ఇల్లు కేటాయించారు. కానీ, ఉంటున్న ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయడానికి ఆయన నిరాకరించారు. మరో మూడు ఇళ్లు చూపించినా ససేమిరా అన్నారు. దీంతో చివరకు చేసేదేమీ లేక.. అధికారులు బంగ్లాకు విద్యుత్, నీటి సరఫరాలను నిలిపివేశారు. అయినా కదలక పోవడంతో చివరకు బలవంతంగా ఖాళీ చేయించారు.