ఉపఎన్నిక ఓటమి భవిష్యత్లో భారీ విజయానికి సంకేతం: రాజ్నాథ్ ఆసక్తికరం
న్యూఢిల్లీ: తాజా విడుదలైన ఉప ఎన్నికల ఫలితాల్లో మెజార్టీ స్థానాల్లో బీజేపీ ఓటమిపై ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందన ఆసక్తికరంగా ఉంది. భారీ విజయాలు అందుకునే క్రమంలో ఎవరైనా రెండు అడుగులు వెనక్కి వేయాల్సి ఉంటుందని, భవిష్యత్లో భారీ ముందడుగు వేయబోతున్నామని వ్యాఖ్యానించారు.
ప్రస్తుత ఓటమి రాబోయే రోజుల్లో తమ పార్టీ సాధించే ఘన విజయానికి సంకేతమని రాజ్నాథ్ సింగ్ చెప్పుకొచ్చారు. తాజాగా విడుదలైన ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీని విపక్షపార్టీలు ఐక్యంగా పోటీ చేసి దెబ్బతీసిన విషయం తెలిసిందే.
4లోకసభ, 10అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో కేవలం 1 ఎంపీ, 1 ఎమ్మెల్యే సీటును బీజేపీ గెలుచుకుంది. దీంతో విపక్ష పార్టీలు సంబరాలు చేసుకుంటున్నాయి. మిత్రపక్షం శివసేన కూడా పాల్ఘర్లో తమ అభ్యర్థిపై బీజేపీ అభ్యర్థి విజయం సాధించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. డబ్బులు పంచి బీజేపీ గెలుపొందిందని శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే ఆరోపించారు.