నేను ఆ భూమిని కబ్జా చేయలేదు: హేమామాలిని
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబై నగరంలోని అత్యంత ఖరీదైన భూమిని కారుచౌక ధరకు తన నాట్య సంస్థకు కట్టబెట్టడంపై చెలరేగుతున్న రాజకీయ దుమారంపై బాలీవుడ్ నటి, భారతీయ జనతా పార్టీ ఎంపి హేమామాలిని స్పందించారు. తానేమీ ఆ భూమిని కబ్జా చేయలేదని స్పష్టం చేశారు.
ఆ భూమిని కొనుగోలు విషయంలో ప్రభుత్వ నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తానని వివరణ ఇచ్చారు. అంధేరి పరిసర ప్రాంతాల్లోని అంబివాలిలో 2వేల చదరపు మీటర్ల స్థలాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం హేమామాలినికి రూ. 70 వేలకే కట్టబెట్టిందని వార్తలు వచ్చాయి.
కాగా, హేమామాలిని నేతృత్వంలోని నాట్యవిహార్ కళాకేంద్ర చారిటీ ట్రస్ట్ ఈ ప్రదేశంలో ఓ నృత్య కేంద్రాన్ని నిర్మించనుంది. ఈ భూకేటాయింపుపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు దిగడంతోపాటు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్పై విమర్శలను ఎక్కుపెట్టింది.
ఈ నేపథ్యంలో హేమమాలిని వివరణ ఇచ్చారు. ఈ భూమికి ఇప్పటివరకు తానేమీ చెల్లించలేదని, ప్రభుత్వ నియమనిబంధనల ప్రకారం ధరను చెల్లించి భూమిని కొనుగోలు చేస్తానని స్పష్టం చేశారు.ఈ భూమిని పొందేందుకు 20ఏళ్లుగా కష్టపడుతున్నానని అన్నారు.