విజయ్కాంత్పై దర్యాప్తు జరపండి: హైకోర్టు ఆదేశం
చెన్నై: ప్రముఖ తమిళ సినీ నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయ్కాంత్ కొత్త చిక్కుల్లొపడ్డారు. జర్నలిస్టు పట్ల దురుసుగా ప్రవర్తించి, వారిని ఉద్దేశించి ఉమ్మివేసిన ఘటనపై విజయ్కాంత్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని మద్రాస్ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. దేవరాజన్ అనే జర్నలిస్ట్ వేసిన పిటిషన్ను శుక్రవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్ సుబ్బయ్య విచారించారు.
గత నెలలో ప్రెస్ మీట్ సందర్భంగా విజయ్ కాంత్ మీడియా ప్రతినిధుల పట్ల దురుసుగా ప్రవర్తించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంతేగాక, వారిని ఉద్దేశించి ‘తూ'అంటూ ఉమ్మివేశారు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ జయలలిత అధికారంలోకి వస్తారని మీరు భావిస్తున్నారా? అని ఓ మీడియా ప్రతినిధి విజయకాంత్ను ప్రశ్నించగా.. ఈ ప్రశ్నను జయలలితను అడిగే దమ్ము మీకుందా? అంటూ మీడియాపై మండిపడ్డారు.
ఆగ్రహంతో ఊగిపోతూ ‘మీకు భయం.. మీరు జర్నలిస్టులా? ‘తూ'' అంటూ ఉమ్మి వేశారు. అప్పట్లో ఈ ఘటనను జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి విచారించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దేవరాజన్ హైకోర్టును ఆశ్రయించారు. డీజీపీ, చెన్నై పోలీస్ కమిషనర్, మైలాపూర్ డిప్యూటి పోలీస్ కమిషనర్లను ఈ మేరకు ఆదేశాలు జారీ చేయాలని కోర్టును కోరారు.
డిసెంబర్ 28న ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేశానని, స్పీడ్ పోస్ట్లో కాపీని పోలీసు ఉన్నతాధికారులకు పంపానని, అయితే పోలీసులు ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలూ తీసుకోలేదని దేవరాజన్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో పిటిషన్ విచారించిన హైకోర్టు.. విజయ్కాంత్పై చట్టప్రకారం కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని పోలీసులను ఆదేశించింది.