వేరే దేశంలో బెదిరిస్తారా?: పద్మావతి చిత్రం ఆందోళనపై హైకోర్టు ఆగ్రహం
ముంబై: పద్మావతి చిత్రంపై దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలపై బాంబే హైకోర్టు గురువారం ఆగ్రహం వ్యక్తం చేసింది. కళాకారులను చంపేస్తామని ఇతర దేశాల్లో బెదిరించరని వ్యాఖ్యానించింది.
వేరే ఏ దేశంలోనైనా ఇలా కళాకారులను చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడతారా? చాలామంది కష్టపడి ఓ సినిమాను తీస్తే బెదిరింపుల కారణంగా సినిమా విడుదల అవకపోవడం చాలా బాధాకరమని, ఈ దేశంలో ఓ ఫీచర్ చిత్రాన్ని విడుదల కానివ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.
అసలు మనం ఏ స్థితికి చేరుకున్నామని, కళాకారుల తల నరికి తెస్తే రివార్డులు ఇస్తామని ప్రకటిస్తున్నారని, వివిధ రాష్ట్రాల సీఎంలు కూడా వారితో సమానంగా ఆందోళనలు చేస్తూ సినిమాను నిషేధించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది మరో రకమైన సెన్సార్షిప్ అని చెప్పింది.
పేరు, డబ్బున్న వారికే ఇలాంటి సమస్యలు ఎదురు అవుతుంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించింది. కాగా, సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన పద్మావతి చిత్రంపై పలు రాష్ట్రాల్లో నిషేధం విధించారు.