కోల్కతా మాజీ సీపీ రాజీవ్ ఇంటికి సీబీఐ అధికారులు.. శారదా చిట్ఫండ్ స్కాం కేసులో అరెస్ట్..?
కోల్కతా : శారదా చిట్ ఫండ్ స్కాంలో కోల్ కతా మాజీ పోలీసు కమీషనర్ రాజీవ్ కుమార్ చుట్టు ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో అరెస్ట్ నుంచి ఇదివరకు మినహాయింపు ఇవ్వగా .. తాజాగా ఆ ఆర్జిని హైకోర్టు వెనక్కి తీసుకుంది. హైకోర్టులో రాజీవ్కుమార్కు చుక్కెదురైంది. అరెస్ట్ నుంచి మినహాయింపు ఇచ్చేందుకు హైకోర్టు అంగీకరించలేదు. దీంతో ఆయనను అరెస్ట్ చేసేందుకు సీబీఐ అధికారులు సన్నద్ధమవుతున్నారు. కాసేపటి క్రితం రాజీవ్ కుమార్ ఇంటికెళ్లారు.
బెంగాల్లో శారదా చిట్ ఫండ్ స్కాం జరిగింది. 2014లో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. శారదా గ్రూఫ్ ఆఫ్ కంపెనీస్ పేరుతో రూ.2500 కోట్లను ఖాతాదారుల నుంచి వసూల్ చేశారు. ఆ నగదు తిరిగి ఇవ్వకపోవడంతో అప్పట్లో దేశవ్యాప్తంగా ఈ కేసు సంచలనం సృష్టించింది. అప్పటి పోలీసు ఉన్నతాధికారి రాజీవ్ కుమార్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ఆయనను బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కాపాడుతున్నారనే ప్రచారం కూడా జరుగుతుంది. ఈ క్రమంలో సీబీఐ అరెస్ట్ చేయొద్దని ముందస్తు బెయిల్ దాఖలు చేశారు. అందుకు ఇదివరకు కోల్ కతా హైకోర్టు అంగీకరించగా .. తాజాగా విరమించుకుంది. దీంతో సీబీఐ అధికారులు రాజీవ్ను అరెస్ట్ చేసేందుకు ఆయన ఇంటికి వెళ్లారు.