నిత్యానందకు చుక్కెదురు, 28న పురుషత్వ పరీక్షలు
సినీ నటి రంజితతో నిత్యానందకు శారీరక సంబంధాలున్నాయన్న వార్తలు అప్పట్లో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. నిత్యానంద మాజీ శిష్యురాలు ఒకరు నిత్యానంద తనను శారీరకంగా వేధించాడని తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ వ్యవహారంలో నిత్యానందను అరెస్ట్ చేయడానికి వెళ్లిన పోలీసులకు నిత్యానంద దొరకలేదు. దీంతో, నిత్యానంద కేసు కోర్టుకు చేరింది. కేసును విచారించిన రామనగర సెషన్స్ కోర్టు నిత్యానందకు పురుషత్వ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. దీనికి సంబంధించి నిత్యానంద పైకోర్టుకు అప్పీల్ చేశాడు. తాను బాలుడితో సమానమని, తనకు సెక్స్ సామర్థ్యం లేదంటూ కోర్టుకు తెలిపాడు. దీంతో కోర్టు పురుషత్వ పరీక్షలపై స్టే విధించింది. ఈ కేసు పెండింగ్లో ఉంది.
ప్రస్తుతం నిత్యానందపై ఉన్న అన్ని కేసులను విచారించిన హైకోర్టు స్టేను ఎత్తి వేసింది. వెంటనే నిత్యానందకు పురుషత్వ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. ఈ క్రమంలో నిత్యానంద తరఫు లాయర్ వాదిస్తూ నిత్యానంద లొంగిపోవడానికి వారం రోజుల గడువు ఇవ్వాలని, అప్పట్లోగా లొంగిపోకపోతే అరెస్ట్ చేయవచ్చని కోర్టును కోరారు. అయితే, ఈ అప్పీల్ను కూడా హైకోర్టు కొట్టివేసింది. దీంతో, నిత్యానంద అరెస్టుకు రంగం సిద్ధమైంది.