చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడితే మరణశిక్షే సరైంది: ఉత్తరాఖండ్ కోర్టు
న్యూఢిల్లీ: చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడే వారికి మరణశిక్ష తప్ప మరొక ప్రస్తావన ఉండకూడదని ఉత్తరాఖండ్ హైకోర్టు అభిప్రాయపడింది. పిల్లలపై అత్యాచారాలపై పాల్పడే వారిని కఠినంగా శిక్షించేందకు వీలుగా కఠినమైన చట్టాలను తీసుకురావాలని జస్టిస్ రాజీవ్ శర్మ, అలోక్సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి సూచించింది.
చిన్నారులపై దాష్టీకాలకు పాల్పడే వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని.. ఈ మేరకు గట్టి చట్టాలు చేయాలని గతంలో సుప్రీం కోర్టు కేంద్రానికి పలుమార్లు సూచించింది. కానీ, శిక్షా స్మృతిలోని లోపాటు.. మానవ హక్కుల సంఘం అభ్యంతరాలతో అది కార్య రూపం దాల్చలేకపోతోంది. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ హైకోర్టు బెంచ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
.పిల్లలపై ఇలాంటి అఘాయిత్యాలు ఈ మధ్య కాలంలో గణనీయంగా పెరిగిపోతున్నాయ్. ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాల్సిన సమయం వచ్చింది. మైనర్లపై అఘాయిత్యాలకు పాల్పడితే వారికి మరణ శిక్ష వేయడమే సరైన శిక్ష అని కోర్టు అభిప్రాయపడింది. అందుకోసం అవసరమైన చట్టాలు చేయాలని అని జస్టిస్ రాజీవ్ శర్మ, అలోక్ సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి సూచించింది.
2016లో ఎనిమిదేళ్ల చిన్నారిని ఓ వ్యక్తి అత్యాచారం చేసి కిరాతకంగా హతమార్చాడు. ఆ కేసులో దిగువ న్యాయస్థానం అతనికి మరణ శిక్ష విధించింది. దీనిని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. శుక్రవారం దీనిపై హైకోర్టు బెంచ్ విచారణ చేపట్టగా పై వ్యాఖ్యలు చేసింది.