వినూత్నం: హైస్కూల్ స్థాయిలోనే శిక్షణ, నేరుగా ఉద్యోగాల్లోకి.. హెచ్ సీఎల్ ప్రయత్నాలు
దేశంలో నాలుగో అతిపెద్ద కంపెనీ హెచ్ సీఎల్ టెక్నాలజీస్ నేరుగా హైస్కూల్ పిల్లలనే రిక్రూట్ చేసుకోవడం ప్రారంభించింది.
న్యూఢిల్లీ: హైస్కూల్ స్థాయిలోనే కొత్త కొత్త ఆవిష్కరణలతో నేటి బుడతలు టెక్నాలజీలో దూసుకెళుతుండడంతో దేశంలో నాలుగో అతిపెద్ద కంపెనీ హెచ్ సీఎల్ టెక్నాలజీస్ నేరుగా హైస్కూల్ పిల్లలనే రిక్రూట్ చేసుకోవడం ప్రారంభించింది.
వారిని సంస్థలోకి నియమించుకుని, అవసరమైన శిక్షణ ఇచ్చి, ఐటీ నిపుణులుగా తీర్చిదిద్దుతోంది ఈ కంపెనీ. ఈ రిక్రూట్ మెంట్ లో భాగంగా సైన్స్ నేపథ్యమున్న 12వ క్లాస్ వారిని ఏడాదికి రూ.1.8 లక్షల వేతనం ఆఫర్ చేస్తూ రిక్రూట్ చేసుకుంటోంది. టెక్స్ట్ యాప్స్ ను అభివృద్ధి చేయడానికి వీరి సేవలను వినియోగించుకుంటోంది.
ఈ టెక్నాలజీ దిగ్గజం ఇటీవలే మధురైలో కూడా ఓ పైలట్ ప్రోగ్రాంను ప్రారంభించింది. ఈ ప్రోగ్రాంలో భాగంగా 100 మంది 12 వ తరగతి విద్యార్తులను నియమించుకునేందుకు ప్రణాళిక రచిస్తోంది. వీరికి తమ కోయంబత్తూరులోని క్యాంపస్ లో ఏడాది పాటు శిక్షణ ఇచ్చి, తర్వాత సంస్థలోకి తీసుకోనున్నట్లు తెలిపింది.
అయితే బోర్డు ఎగ్జామ్స్ లో 85 శాతం కంటే పైగా మార్కులు వచ్చిన వారికే ఈ అవకాశం దక్కుతుందట. అంతేకాక సహకార వెంచర్ ఏర్పాటు చేసి, ఎస్ఎస్ఎన్ ఇంజనీరింగ్ కాలేజీ ద్వారా బీఎస్ఈ డిగ్రీ పొందే అవకాశాన్ని కూడా కల్పిస్తోంది.
ఎక్కువ అవకాశాలు చేతిలో లేని వారికి ఈ శిక్షణ ఎంతగానో సహకరిస్తుందని ఇండస్ట్రీ నిపుణులు కూడా చెబుతున్నారు. రెగ్యులర్ కోర్సులు చేయలేని విద్యార్థులకు ఇదొక మంచి అవకాశమని ఎచ్ సీఎల్ టెక్నాలజీస్ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి శివశంకర్ తెలిపారు.