అంబులెన్స్ లు, పోలీసు వాహనాల్లో ఓటర్లకు నగదు రవాణా, సీఎం పవర్ తో: మాజీ ప్రధాని!
బెంగళూరు: భారత మాజీ ప్రధాని హెచ్ డీ. దేవేగౌడ ఆయన మాజీ శిష్యుడు, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య మీద సంచలన ఆరోపణలు చేశారు. సిద్దరామయ్య అధికారం అడ్డంపెట్టుకుని అంబులెన్స్ లు, పోలీసు వాహనాల్లో ఓటర్లకు నగదు సరఫరా చేస్తున్నారని బాంబుపేల్చారు. మాజీ ప్రధాని హెచ్.డీ. దేవేగౌడ ఆరోపణలపై స్పంధించిన ఎన్నికల కమిషన్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది.
అధికార దుర్వినియోగం
ముఖ్యమంత్రి హోదాలో సిద్దరామయ్య అధికారం అడ్డంపెట్టుకుని అధికారులను ఇష్టం వచ్చినట్లు వాడుకుంటున్నారని, ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సహకరించాలని తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకు వస్తున్నారని మాజీ ప్రధాని హెచ్ డీ. దేవేగౌడ ఆరోపించారు.
అంబులెన్స్, పోలీసు జీపులు
కర్ణాటక హోం శాఖను అడ్డంగా వాడుకుంటున్న సీఎం సిద్దరామయ్య అంబులెన్స్ లు, పోలీసు వాహనాల్లో ఎన్నికల ఖర్చుల కోసం, ఓటర్లకు పంచిపెట్టడానికి నగదు రవాణా చేస్తున్నారని, పోలీసుల మీద ఒత్తిడి తీసుకువస్తున్నారని మాజీ ప్రధాని హెచ్ డీ. దేవేగౌడ సంచలన ఆరోపణలు చేశారు.
హోం శాఖ సలహాదారుడు
కర్ణాటక హోం శాఖ సలహాదారుడైన కెంపెయ్య తన పలుకుబడి ఉపయోగించి పోలీసు అధికారులు, సిబ్బంది మీద ఒత్తిడి తీసుకువచ్చి తాను చెప్పినట్లు వినాలని బెదిరింపులకు పాల్పడుతున్నారని మాజీ ప్రధాని హెచ్.డీ. దేవేగౌడ సంచలన ఆరోపణలు చేస్తూ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు.
దేవేగౌడ హయంలో !
తాను అధికారుల విధులు దుర్వినియోగం చెయ్యలేదని, వారిని ఎన్నికల విధుల కోసం ఉపయోగించుకోలేదని సీఎం సిద్దరామయ్య అన్నారు. అలా చేసి ఉంటే ఎన్నికల కమీషన్ తన మీద చర్యలు తీసుకోవచ్చని చెప్పారు. ఇక అంబులెన్స్ లు, పోలీసు జీపుల్లో నగదు సరఫరా హెచ్ డీ. దేవేగౌడ హయాంలో జరిగి ఉంటుందని మాజీ ప్రధానికి సిద్దరామయ్య కౌంటర్ ఇచ్చారు.
ఎన్నికల కమీషన్ ఎంట్రీ
మాజీ ప్రధాని హెచ్ డీ. దేవేగౌడ ఫిర్యాదుపై విచారణకు ఆదేశాలు జారీ చేశామని ఎన్నికల కమీషన్ చీఫ్ ఓపీ. రావత్ శుక్రవారం విదాన సౌధలో మీడియాకు చెప్పారు. చట్టపరంగా హోంశాఖ సలహాదారు పదవి లేదని, ఎన్నికల నియమాలు అమలులో ఉన్నందున కెంపెయ్య ఆ పదవిలో ఉండటానికి తాము అంగీకరించమని ఓపీ. రావత్ స్పష్టం చేశారు.