కుమారస్వామికి వాస్తు, జ్యోతిష్యంపై నమ్మకం, అందుకే ఆ భవనంపై మక్కువ
బెంగుళూరు:జెడి(ఎస్) నేత హెచ్డి కుమారస్వామికి వాస్తుపై నమ్మకం ఎక్కువ .రాహుకాలం, ముహుర్తాలను కూడ ఎక్కువగా విశ్వసిస్తారని ప్రచారం కూడ లేకపోలేదు. అయితే ఈ దఫా కర్ణాటక రాష్ట్రంలో ఐదేళ్ళ పాటు సీఎంగా కొనసాగాలని కుమారస్వామి భావిస్తున్నారు. ఈ తరుణంలో అధికారిక నివాసానికి వాస్తుకు అనుకూలంగా ఉన్న బంగ్లాను ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు. ఈ మేరకు ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రత్నప్రభ ఇల్లు అయితే ప్రయోజనంగా ఉంటుందని భావిస్తున్నారని సమాచారం.
కర్ణాటకలో విశ్వాస పరీక్షకు ముందే యడ్యూరప్ప రాజీనామా చేశారు. ఈ రాజీనామా తర్వాత కర్ణాటకలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్, జెడి(ఎస్) ముందుకు వచ్చింది. జెడి(ఎస్) నేత కుమారస్వామికి ముఖ్యమంత్రి పదవిని ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొంది. ఈ నిర్ణయం మేరకు కుమారస్వామి మే 23వ తేదిన సీఎంగా ప్రమాణం చేయనున్నారు.
అయితే కుమారస్వామి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నివాసానికి అనుకూలమైన బంగ్లా కోసం అన్వేషణ సాగిస్తున్నారు. అయితే ముహుర్తాలు, వాస్తుపై కుమారస్వామికి నమ్మకాలెక్కువ. ఈ కారణంగానే అన్ని రకాలుగా వాస్తు దోషం లేని ఇంటి కోసం వెతుకుతున్నారు.
కుమారస్వామికి వాస్తుపై నమ్మకం
జెడి(ఎస్) నేత కుమారస్వామికి వాస్తుపై విశ్వాసం ఎక్కువ. ముహుర్తాలపై కూడ ఆయన నమ్ముతారని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. రాహుకాలంలో కుమారస్వామి ఏ కార్యాన్ని కూడ తలపెట్టడు. దీంతో తాను ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా సరే వాస్తు, ముహుర్తాలను చూసుకొని ప్రారంభిస్తారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అందుకే ముఖ్యమంత్రిగా నివాసం ఉండే బంగ్లాలో కూడ అన్ని రకాలుగా వాస్తు దోషాలు లేకుండా చూడాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి.
సీఎస్ రత్నప్రభ ఇల్లు వాస్తుకు ఓకే
కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న రత్నప్రభ ఇల్లు వాస్తుపరంగా అనువైందిగా ఉందని కుమారస్వామి సన్నిహితులు భావిస్తున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత రత్నప్రభ ఇంట్లో కుమారస్వామి ఉంటే వాస్తు సమస్యలు ఉండవని ఆయన సన్నిహితులు భావిస్తున్నారు. అడవిలో ఉన్న గెస్ట్హౌజ్ మాదిరిగా ఈ భవనం ఉంటుంది. అందుకే ఈ భవనం వైపే కుమారస్వామి సన్నిహితులు సానుకూలంగా ఉన్నారని చెబుతున్నారు.
అనుగ్రహలో వాస్తు అనువుగా లేదా?
కర్ణాటక సీఎంకు అనుగ్రహ అధికారిక నివాసం . అయితే ఈ నివాసం వాస్తు పరంగా కూడ ఇబ్బందులున్నాయనే ప్రచారం కూడ లేకపోలేదు. అయితే ఈ ఇంట్లో నివాసం ఉండేందుకు కుమారస్వామి ఇష్టంగా లేరనే ప్రచారం కూడ సాగుతోంది. ఈ నివాసంలో ఉన్న సీఎంలు ఆ తర్వాత రాజకీయంగా అనేక ఒడిదొడుకులను ఎదుర్కొన్నారని ప్రచారం కర్ణాటకలో ఉంది. దీంతో కుమారస్వామి అనుగ్రహలో ఉండేందుకు అయిష్టతను వ్యక్తం చేస్తున్నారని సమాచారం.
పూర్తికాలం సీఎంగా ఉండలేరా
అనుగ్రహ నివాసంలో ఉంటే ముఖ్యమంత్రిగా పూర్తి కాలం కొనసాగరనే ప్రచారం కర్ణాటకలో ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని అనుగ్రహ నివాసానికి కుమారస్వామి ప్రాధాన్యతను ఇవ్వడం లేదంటున్నారు.1994లో ముఖ్యమంత్రిగా ఉన్న దేవేగౌడ అనుగ్రహలోనే నివాసం ఉండేవారు.అయితే ఆనాడు దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని 1996లో దేవేగౌడ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్న ఎస్ఎం కృష్ణ , ఎన్. ధరంసింగ్, సదానందగౌడ కూడ పూర్తికాలం పదవిలో కొనసాగలేదు. 2006లో కుమారస్వామి కూడ సీఎం అయిన తర్వాత కొంత కాలం పాటు ఈ బంగళాలోనే ఉన్నారు. ఈ సమయంలో కూడ ఆయన పూర్తికాలం పాటు పదవిలో కొనసాగలేదు. దీంతో కుమారస్వామి ఈ భవనంలో ఉండేందుకు ఆసక్తిని చూపడం లేదని సమాచారం.